ఇంధన కొరత కారణంగా జూలై వరకు అన్ని అంతర్జాతీయ విమానాలను రద్దు అయ్యాయయంటూ వచ్చిన వార్తలను ఎయిర్ ఇండియా ఖండించింది. సోషల్ మీడియాలో, కొన్ని వెబ్ సైట్లలో ఈ ప్రచారం విస్తృతంగా సాగడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆ సంస్థ స్పష్టం చేసింది. అన్ని విదేశీ విమానాలను నిలిపివేయలేదని, కేవలం కొన్ని మార్గాల్లో తాత్కాలిక మార్పులు మాత్రమే చేస్తున్నామని వెల్లడించింది..
ఇంతకీ ఎయిర్ ఇండియా ఏం చెప్పిందంటే?
అంతర్జాతీయ విమానాల రద్దుపై ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన చేసింది. “అన్ని అంతర్జాతీయ విమానాలను రద్దు చేశామన్న వార్తలు పూర్తిగా అసత్యం. అవి కేవలం నిరాధారమైన ప్రచారం మాత్రమే” అని తేల్చి చెప్పింది. ప్రస్తుతం కొన్ని రూట్లలో సర్వీసులను తగ్గిస్తున్నప్పటికీ, అంతర్జాతీయ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది.
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా జెట్ ఇంధన ధరలు భారీగా పెరగడం విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అదే సమయంలో పాకిస్తాన్ గగనతలం మూసివేయడంతో భారత్ నుంచి మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లే విమానాలు సుదూర మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో విమానాల ఇంధన వినియోగం పెరగడమే కాకుండా, సిబ్బంది ఖర్చులు, మెయింటెనెన్స్ వ్యయాలు గణనీయంగా పెరిగాయి. ఈ పరిస్థితులతో కొన్ని అంతర్జాతీయ మార్గాల్లో లాభాలు తగ్గాయని ఎయిర్ ఇండియా తెలిపింది. అందుకే జూన్ నెల నుంచి మూడు నెలల పాటు కొన్ని రూట్లలో తాత్కాలిక కోతలు అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఢిల్లీ నుంచి చికాగో, నెవార్క్, సింగపూర్, షాంఘై నగరాలకు వెళ్లే కొన్ని విమాన సర్వీసులను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
అటే పాకిస్తాన్ గగనతలం అందుబాటులో లేకపోవడంతో యూరప్, ఉత్తర అమెరికా వెళ్లే విమానాలు ప్రస్తుతం పొడవైన మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. కొన్ని సర్వీసులు మధ్యలో వియన్నా, స్టాక్ హోమ్ లాంటి నగరాల్లో హాల్టింగ్ తీసుకుంటున్నాయి. ఈ మార్పుల వల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా, అదనపు ఇంధనం అవసరం అవుతోంది. అందుకే, పలు విమాన సంస్థలు పలు సర్వీసులను రద్దు చేస్తున్నాయి.
జెట్ ఇంధన ధరల పెరుగుదల విమానయాన సంస్థలకు పెద్ద సవాలుగా మారింది. గత వారానికి జెట్ ఇంధన ధరలు బ్యారెల్కు 99.40 డాలర్ల నుంచి 162.89 డాలర్ల వరకు పెరిగినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి. సాధారణంగా ఒక విమానయాన సంస్థ నిర్వహణ ఖర్చుల్లో దాదాపు 40 శాతం వరకు ఇంధనానికే వెచ్చించాల్సి ఉంటుంది. అందువల్ల చమురు ధరలు పెరిగితే దీర్ఘదూర విమానాల నిర్వహణ మరింత భారంగా మారుతుంది. ఈ పరిస్థితులపై ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ కూడా ఉద్యోగులతో మాట్లాడారు. పెరిగిన ఇంధన ధరలు, గగనతల పరిమితులు, అదనపు ప్రయాణ సమయం వంటి కారణాలతో కొన్ని అంతర్జాతీయ రూట్లు ప్రస్తుతం లాభదాయకంగా లేవని చెప్పారు. అవసరాన్ని బట్టి కొన్ని సర్వీసులను తాత్కాలికంగా తగ్గించే అవకాశం ఉందని కూడా ఆయన వివరించారు. అయితే. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంస్థ చెబుతోంది. అన్ని అంతర్జాతీయ విమానాలను నిలిపివేయడం లేదని, పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్గాల్లో మాత్రమే మార్పులు చేస్తున్నామని స్పష్టం చేసింది.
Read Also: 320 కి.మీ వేగంతో బుల్లెట్ రైలు పరుగులు.. ట్రాక్ ల నిర్మాణంలో జపాన్ సీక్రెట్ టెక్నాలజీ వినియోగం!