Begunkodar Railway Station: దేశ వ్యాప్తంగా ఎన్నో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఎంతో మంది సిబ్బంది పని చేస్తున్నారు. కానీ, ఓ రైల్వే స్టేషన్ పేరు చెప్తే రైల్వే ఉద్యోగులు వెన్నులో వణుకు పుట్టేది. అక్కడ పని చేసేందుకు ఎవ్వరూ ముందుకు వచ్చేవారు కాదు. ఎవరైనా ధైర్యం చేసినా, ప్రాణాలతో మిగిలేవాళ్లు కాదు. ఓ దెయ్యం రైల్వే స్టేషన్ లోని వారిని పగబట్టి చంపేస్తుందనే ప్రచారం జరిగింది. దేశవ్యాప్తంగా ఘోస్ట్ రైల్వే స్టేషన్ గా గుర్తింపు పొందింది. చివరకు ఈ స్టేషన్ క్లోజ్ అయ్యింది. ఇంతకీ ఈ దయ్యం రైల్వే స్టేషన్ వెనుకున్న అసలు కథ ఏంటంటే?
బేగుంకోదర్ రైల్వే స్టేషన్ ఘోస్ట్ స్టోరీ
రైల్వేశాఖలో పని చేసే ప్రతి ఒక్కరికి పశ్చిమ బెంగాల్ లోని బేగుంకోదర్ రైల్వే స్టేషన్ గురించి బాగా తెలిసే ఉంటుంది. భారతీయ రైల్వే సంస్థ తమ రికార్డులలో హాంటెడ్ స్టేషన్ గా గుర్తించింది. ఈ స్టేషన్ను 1960లో నిర్మించారు. స్థానిక ప్రజలకు ఎంతగానో ఉపయోగపడింది. కానీ, ఆ తర్వాత ఈ స్టేషన్ లో ఓ దెయ్యం తిరుగుతుందనే ప్రచారం జరిగింది. తెల్లటి చీర కట్టుకుని రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను చూసి స్టేషన్ మాస్టర్ మృతి చెందినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. రైల్వే అడ్మినిస్ట్రేషన్ మొదట బెగుంకోదర్ స్టేషన్ గురించి పుకార్లను కొట్టిపారేసింది. అయితే, స్టేషన్ మాస్టర్, అతడి కుటుంబ సభ్యుల అనుమానాస్పద మరణాలు ప్రజల భయాన్ని పెంచాయి. ఈ మరణాలు పుకార్లను వాస్తవంగా మార్చాయి.
పని చేసేందుకు భయపడ్డ రైల్వే ఉద్యోగులు
భద్రతా కారణాల దృష్ట్యా బేగుంకోదర్ రైల్వే స్టేషన్ లో పని చేసేందుకు ఉద్యోగులు నిరాకరించారు. కొత్త ఉద్యోగులను నియమించేందుకు రైల్వే అధికారులు ప్రయత్నించారు. అయితే, ఈ స్టేషన్ గురించి తెలిసన వాళ్లెవరూ పని చేసేందుకు ముందుకురాకపోవడంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. అధికారులు ఎట్టకేలకు బెగుంకోదర్ స్టేషన్ను మూసివేశారు. ఈ మూసివేత స్టేషన్ లో దెయ్యం ఉందనే ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. మమతా బెనర్జీ 2009లో రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో దీనిని తిరిగి ప్రారంభించారు. అయినప్పటికీ, భయం కొనసాగింది. సాయంత్రం 5 గంటల తర్వాత ఎవరూ స్టేషన్లో ఉండరు.
బేగన్కోదర్ స్టేషన్ మిస్టరీ వెనుక అసలు నిజం ఏంటి?
బేగుంకోదర్ రైల్వే స్టేషన్ లోని దెయ్యం కథ వెనుకున్న అసలు వాస్తవాలను బయటపెట్టేందుకు బెంగాల్ కు చెందిన బిగ్యాన్ మంచాకు చెందిన 9 మంది హేతువాదుల బృందం రాత్రిపూట బేగుంకోదర్ స్టేషన్ను పరిశీలించింది. పోలీసుల రక్షణతో ఈ బృందం రాత్రి అక్కడే బస చేసింది. ఈ టీమ్ లీడర్ నయన్ ముఖర్జీ స్టేషన్ లో ఎలాంటి దెయ్యాలు లేవని తేల్చారు. తెల్లవారుజామున 2 గంటలకు స్టేషన్ వెనుక వారికి వింత శబ్దాలు వినిపించాయి. పొదల్లో దాక్కున్న వ్యక్తుల గుంపు దీనికి కారణమని వారు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించినా పారిపోయారు. స్థానికులలో కొంత మంది పర్యాటకులను దోచుకోవడానికి దెయ్యం కథను అల్లారని ముఖర్జీ వెల్లడించారు.
బేగుంకోదర్ గురించిన వివరాలు
బెగుంకోదర్ రైల్వే స్టేషన్ సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్లో భాగం. ఇది బెంగాల్లోని పురూలియా జిల్లాలో ఉంది. ఈ స్టేషన్ బెగుంకోడోర్, ఝల్దా మధ్య ప్రజలకు సేవలు అందిస్తుంది. ఈ పట్టణం జార్ఖండ్ సరిహద్దుకు సమీపంలో ఉంది. బెగుంకోదర్ జనాభా 6,437. దాదాపు 91% గ్రామీణులు. పట్టణ ప్రాంతాల్లో కొద్ది భాగం మాత్రమే నివసిస్తున్నారు.