New Railway Lines in AP: ఆంధ్రప్రదేశ్ రైల్వే రంగంలో మరో ముఖ్యమైన ముందడుగు పడబోతోంది. రాష్ట్ర అభివృద్ధికి ఊతమిచ్చేలా కొత్తగా ఆరు రైల్వే లైన్లు రాబోతున్నాయి. వీటికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి ఈ రైల్వే మార్గాలు ఎంతో ఉపయోగకరంగా మారబోతున్నాయి. ఈ కొత్త మార్గాలు అమల్లోకి వస్తే, ప్రయాణికులకు మాత్రమే కాదు, రైతులు, వ్యాపారులు కూడా లాభం పొందే అవకాశముంది.
ప్రస్తుతం ప్రతిపాదనలో ఉన్న ప్రధాన మార్గాలలో తాడిపత్రి నుంచి అనంతపురం వరకు నేరుగా కలుపే లైన్ ఒకటి. అలాగే రాయచోటి, కదిరి మీదుగా హిందూపురం వరకు మరో మార్గం రూపొందించనున్నారు. ధర్మవరం నుంచి బళ్లారి, మంత్రాలయం నుంచి కర్నూలు, ముద్దనూరు నుంచి ముదిగుబ్బ, మార్కాపురం నుంచి శ్రీశైలం వరకు రైల్వే లైన్లు వేయాలని ప్రణాళికలు రెడీ చేశారు. ఈ మార్గాలు ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించి సర్వే ప్రక్రియ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. తదుపరి దశగా రైల్వే బోర్డు నుంచి ఆమోదం పొందాల్సి ఉంది. ఆమోదం వచ్చిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ అమలు అయితే రాయలసీమ ప్రాంతానికి రైల్వే కనెక్టివిటీ మరింత పెరుగుతుంది.
ఇప్పటి వరకు రాయలసీమ ప్రాంతంలో రైల్వే కనెక్టివిటీ పరిమితంగానే ఉండటం వల్ల ప్రజలు ఎక్కువగా రోడ్డు మార్గాలపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా బెంగళూరు లాంటి ప్రధాన నగరాలకు వెళ్లే వారికి ప్రయాణం కొంత కష్టంగా మారుతోంది. కొత్త రైల్వే మార్గాలు అందుబాటులోకి వస్తే ఈ సమస్య చాలా వరకు తగ్గుతుంది. ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. రవాణా ఖర్చులు తగ్గడం కూడా ఈ ప్రాజెక్ట్ వల్ల కలిగే మరో ప్రయోజనం. రైతులు తమ పంటలను తక్కువ ఖర్చుతో మార్కెట్లకు తరలించగలుగుతారు. అలాగే చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సరుకు రవాణా సులభమవడం వల్ల వ్యాపార కార్యకలాపాలు వేగవంతం అవుతాయి.
ఇక ప్రాంతీయ అభివృద్ధి పరంగా చూస్తే, ఈ రైల్వే లైన్లు కొత్త అవకాశాలకు దారితీస్తాయి. పరిశ్రమలు, విద్యా సంస్థలు, పర్యాటక రంగం లాంటి రంగాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలకు రైల్వే సదుపాయం పెరగడం వల్ల భక్తులకు మరింత సౌలభ్యం కలుగుతుంది. ఈ ఆరు రైల్వే లైన్లు అందుబాటులోకి వస్తే రాయలసీమ ప్రాంతానికి ఒక కీలక మలుపుగా మారుతుంది. రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా, ఆర్థికంగా కూడా ఈ ప్రాంతం ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Read Also: వేసవి రద్దీ నేపథ్యంలో రైల్వే కీలక నిర్ణయం, అందుబాటులోకి ఏకంగా 18,262 ప్రత్యేక రైళ్లు!