Summer Train Travel: వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పెద్ద మొత్తంలో ప్రత్యేక రైళ్లను నడపడానికి సిద్ధమవుతోంది. జూలై 15 వరకు ఏకంగా 18,262 ప్రత్యేక రైలు ట్రిప్పులను నడపాలని నిర్ణయించింది. తాజాగా నిర్ణయంతో సెలవుల సమయంలో ప్రయాణించే వారికి భారీ ఉపశమనం లభించే అవకాశం ఉంది.
ఎక్కువ రద్దీ ఉండే మార్గాల్లో అదనపు సర్వీసులు అందించడం ద్వారా ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చడమే ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికే ప్రత్యేక రైళ్ల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించగా, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ ఏర్పాట్లను పరిశీలించారు. రద్దీ ఎక్కువగా ఉండే రూట్లపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ సమ్మర్ లో ఇప్పటి వరకు సుమారు 11,878 ప్రత్యేక ట్రిప్పులు ప్రకటించగా, మిగతా ట్రిప్పుల వివరాలను కూడా త్వరలో ఖరారు చేయనున్నారు. ఈ భారీ ప్రణాళికను ఎలాంటి ఇబ్బంది లేకుండా అమలు చేయడానికి రైల్వే శాఖ పలు చర్యలు తీసుకుంటోంది. అందులో ముఖ్యంగా అదనపు బోగీల అందుబాటు, సరైన షెడ్యూలింగ్, అలాగే రైళ్ల కదలికలపై నిరంతర పర్యవేక్షణ ఉన్నాయి.
దేశంలోని ప్రధాన నగరాలైన న్యూఢిల్లీ, ముంబై, సూరత్, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేషన్లలో ప్రయాణికులు సులభంగా ఎక్కి దిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా రద్దీని నియంత్రించడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించడం, క్యూలను సక్రమంగా నిర్వహించడం లాంటి పనులు చేపడుతున్నారు. అలాగే కొన్ని స్టేషన్లలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించి రియల్ టైమ్ క్రౌడ్ మేనేజ్ మెంట్ అమలు చేస్తున్నారు. దీనివల్ల ఎక్కడ రద్దీ ఎక్కువగా ఉందో వెంటనే గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. సూరత్ సమీపంలోని ఉధ్నా స్టేషన్లో ఇప్పటికే ఈ విధానం అమలు చేస్తున్నారు. తమ స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రైలులో ఎక్కే సమయంలో ఎటువంటి గందరగోళం లేకుండా ఉండేందుకు రైల్వే రక్షణ దళం సిబ్బంది సహాయం అందిస్తున్నారు. ప్రయాణికులు సురక్షితంగా, క్రమబద్ధంగా రైల్లో ఎక్కేలా పర్యవేక్షిస్తున్నారు.
ఈ వేసవిలో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉండేలా భారతీయ రైల్వే పెద్ద స్థాయిలో ప్రణాళికలు అమలు చేస్తోంది. రద్దీని తగ్గించడం, ప్రయాణికులకు సౌలభ్యం కల్పించడం లక్ష్యంగా కీలక చర్యలు చేపడుతోంది. రద్దీని బట్టి అసవరం అయితే, మరిన్ని అదనపు రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే ప్రకటించింది.
Read Also: వేసవి వేళ రైల్వే స్పెషల్ అరెంజ్ మెంట్స్.. వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్!