2025-26కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. రైల్వే కేటాయింపుల గురించి కీలక చర్చ మొదలయ్యింది. దేశ మౌలిక సదుపాయాలకు వెన్నెముక అయిన భారతీయ రైల్వేకు బడ్జెట్ కేటాయింపులలో గణనీయమైన కేటాయింపులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈసారి రైల్వేకు సుమారు రూ. 3.5 లక్షల కోట్లు కేటాయింపులు జరగాల్సిన అవసరం ఉందంటున్నారు ఇండియన్ రైల్వే మాజీ జనరల్ మేనేజర్ దేబీ ప్రసాద్ దాస్. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ తో పోల్చితే 20 శాతం ఎక్కువగా కేటాయించే అవకాశం ఉందన్నారు. ఈ బడ్జెట్ తో రైల్వేశాఖ ఏ ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం..
⦿హై-స్పీడ్ రైలు ప్రాజెక్టులు: తాజాగా బడ్జెట్ తో ప్రతిపాదిత హైస్పీడ్ కారిడార్లు అయిన ఢిల్లీ-వారణాసి, చెన్నై-బెంగళూరు, ముంబై-ఢిల్లీ నిర్మాణాలు పూర్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టులతో కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనున్నారు.
⦿భద్రత, సాంకేతిక పురోగతి:
కవచ్ విస్తరణ: భద్రతా చర్యలను మెరుగుపరచడానికి ఈ ఆర్థిక సంవత్సరంలో 5,000 కి.మీ రైల్వే ట్రాక్ లలో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.
ట్రాక్, బ్రిడ్జి పునరుద్ధరణలు: సిగ్నలింగ్ అప్ గ్రేడ్లపై దృష్టి సారించి బ్యాక్ లాగ్ లను తొలగించడంతో పాటు ట్రాక్ లు, బ్రిడ్జిలను పునరుద్ధరణలు చేపట్టనున్నారు.
సర్వైలెన్స్ డ్రోన్ టెక్నాలజీ: సున్నిత ప్రాంతాల్ఓ మెరుగైన భద్రత కోసం డ్రోన్లతో పెట్రోలింగ్ నిర్వహించనున్నారు.
⦿మౌలిక సదుపాయాల అభివృద్ధి:
2025-26లో 6,000 కి.మీ కొత్త ట్రాక్ లను ఏర్పాటు చేయడంతో పాటు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టనున్నారు. గంటకు 160 కి.మీ వేగానికి సపోర్టు చేసేలా ట్రాక్ లను అప్ గ్రేడ్ చేయనున్నారు. వేగం, సామర్థ్యాన్ని పెంచడానికి హై-డెన్సిటీ నెట్ వర్క్, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ను 2x 25 kV ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ గా మార్చనున్నారు.
⦿రోలింగ్ స్టాక్ విస్తరణ: ఈ ఆర్థక సంవత్సరం లో 1,700 ఎలక్ట్రిక్ లోకోమోటివ్ లతో పాటు 8,500 కోచ్ లను తయారు చేయనున్నారు. వీటిలో 4,000 నాన్-AC కోచ్లు, 100 అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ కోచ్లు, 800 వందే భారత్ కోచ్లు, 1,000 MEMU/EMU/వందే మెట్రో కోచ్లు ఏర్పాటు చేయనున్నారు. హైడ్రోజన్ తో నడిచే లోకోమోటివ్ లతో పాటు 2025-26లో 10 వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.
⦿రైల్వే పనితీరు, ఆదాయ లక్ష్యాలు: 2005-26 ఆర్థిక సంవత్సరంలో సుమారు 1,800 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా రూ. 2,00,000 కోట్ల ఆదాయాన్ని పొందాలని భావిస్తున్నది. సుమారు రూ. 90 వేల కోట్లను టికెట్ల విక్రయం ద్వారా పొందాలని భావిస్తున్నది. ఛార్జీలు కాని ఆదాయం ప్రస్తుతం రూ. 10,500 కోట్లు ఉండగా, ఈ ఆదాయాన్ని 10-15%కి పెంచడానికి ప్రయత్నిస్తున్నది.
⦿సాంకేతికత వినియోగం: కార్యాచరణ సామర్థ్యం, కస్టమర్ సేవను మెరుగుపరచడానికి AI, బిగ్ డేటా, ఇండస్ట్రీ 5.0 టెక్నాలజీలను ఉపయోగించుకోవాలని రైల్వే సంస్థ భావిస్తున్నది. భద్రత, కార్యాచరణ విభాగాల్లో అధునాతన పరిష్కారాలను అమలు చేయడానికి R&Dలో ఎక్కువ పెట్టుబడి పెట్టాలని రైల్వే భావిస్తున్నది.
గత బడ్జెట్ లో రూ. 2.62 లక్షల కోట్ల కేటాయింపులు
2024-25 బడ్జెట్ లో భారతీయ రైల్వే రూ.2.62 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపును అందుకుంది. కేటాయించిన బడ్జెట్లో 70% కంటే ఎక్కువ ఉపయోగించుకుంది. పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేసింది. వీటిలో స్టేషన్ల రెన్నొవేషన్, రోడ్ అండర్ బ్రిడ్జిలు, రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణంతో పాటు రైల్వే లైన్లల పొడిగింపులు, గేజ్ మార్పిడులతో పాటు కొత్త రైళ్లను ప్రవేశపెట్టింది. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (USBRL) ప్రాజెక్ట్ పూర్తి చేయడంతో పాటు హై-స్పీడ్ రైల్ (HSR) విభాగంలో కీలక ముందడుగు పడింది. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం 50-కి.మీ పొడవైన కారిడార్ విద్యుదీకరణ కూడా కొనసాగుతోంది. కవాచ్ 4.0ని ప్రారంభించడంతో పాటు లోకోమోటివ్లు, ప్యాసింజర్ కోచ్లను తయారు చేసింది. వందే భారత్ రైళ్లు, వందే భారత్ స్లీపర్ రైళ్లు, వందే మెట్రో, అమృత్ భారత్ 2.0 కోసం కొత్త రేక్లు రెడీ అవుతున్నాయి.
Read Also: నిమిషానికి 2.5 లక్షల టిక్కెట్ల జారీ, ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం!