Hyderabad-Tirumala Caravan Journey: హైదరాబాద్ నుంచి తిరుమల యాత్రకు వెళ్లే భక్తులు సాధారణంగా కారు, బస్సు లేదంటే రైల్లో వెళ్తారు. అయితే, ఇటీవల చాలా మంది కారవాన్ ప్రయాణాలు చేస్తున్నారు. ప్రయాణం, విశ్రాంతి, వసతి అన్నీ ఒకే వాహనంలో లభించడంతో కుటుంబాలు, స్నేహితులు కారవాన్లను ఎంచుకుంటున్నారు. హ్యాపీగా ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ తిరుమల దర్శనానికి వెళ్తున్నారు.
హైదరాబాద్ నుంచి తిరుమల వరకు రోడ్డు మార్గంలో సుమారు 600 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రానుపోను కలిపి దాదాపు 1,200 కిలోమీటర్లు ఉంటుంది. కర్నూలు, కడప, తిరుపతి మీదుగా ఈ ప్రయాణం సాగుతుంది. ఈ మార్గంలో మంచి రహదారులు ఉండటంతో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. మార్గమధ్యలో భోజనం, విశ్రాంతి కోసం బోలెడు సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి.
కారవాన్ ప్రయాణంతో పాటు వసతి సౌకర్యాలను కలిపి అందిస్తుంది. ఇందులో ప్రయాణికులు కూర్చోవడానికి మాత్రమే కాకుండా విశ్రాంతి తీసుకోవడానికి, నిద్రించడానికి కూడా సౌకర్యాలు ఉంటాయి. సాధారణంగా 10 నుంచి 12 మంది వరకు ప్రయాణించవచ్చు. రాత్రి సమయంలో 6 నుంచి 8 మంది వరకు చక్కగా పడుకోవచ్చు. వాటర్ స్పెసిలిటీ, స్టోరేజ్ ప్లేస్, బెడ్లు సహా అవసరమైన అన్ని సౌకర్యాలు ఇందులో ఉంటాయి.
ఈ యాత్రను సాధారణంగా మూడు రోజుల పాటు కొనసాగుతుంది. మొదటి రోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి కర్నూలు దగ్గర బ్రేక్ ఫాస్ట్, కడప సమీపంలో భోజనం చేసి సాయంత్రానికి తిరుపతి చేరుకోవచ్చు. ప్రయాణంలో ఎక్కడైనా ఆగి విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది. హోటల్ అవసరం లేకుండా కారవాన్ లోనే రాత్రి బస చేయవచ్చు.
రెండో రోజు తిరుమల శ్రీవారి దర్శనానికి కేటాయించవచ్చు. ముందుగానే దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకుంటే సమయం మరింత ఆదా అవుతుంది. దర్శనం అనంతరం తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు. సాయంత్రం తిరుపతిలో విశ్రాంతి తీసుకుని రాత్రికి కారవాన్ లోనే బస చేయవచ్చు.
మూడో రోజు ఉదయం తిరుగు ప్రయాణం ప్రారంభించి కడప, కర్నూలు మీదుగా హైదరాబాద్ చేరుకోవచ్చు. ట్రాఫిక్ పరిస్థితులను బట్టి సాయంత్రం లేదంటే రాత్రికి గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది.
ఖర్చుల విషయానికి వస్తే, కారవాన్ అద్దె సాధారణంగా ప్రయాణ దూరం ఆధారంగా నిర్ణయిస్తారు. కిలోమీటరుకు సుమారు రూ.70 చొప్పున లెక్కిస్తే, 1,200 కిలోమీటర్ల రానుపోను ప్రయాణానికి దాదాపు రూ.84,000 ఖర్చు అవుతుంది. దీనికి టోల్ చార్జీలు, స్టేట్ ట్యాక్స్, పర్మిట్ ఛార్జీలు కలిపి మరో రూ.4,500 నుంచి రూ.7,000 వరకు అదనంగా అయ్యే అవకాశం ఉంది. దీంతో మొత్తం ప్రయాణ ఖర్చు సుమారు రూ.90,000 వరకు చేరవచ్చు. ఈ ఖర్చును ప్రయాణికుల సంఖ్యను బట్టి పంచుకుంటే ఒక్కొక్కరిపై భారం తగ్గుతుంది. ఆరుగురు ప్రయాణిస్తే ఒక్కొక్కరికి సుమారు రూ.15,000, ఎనిమిది మందికి రూ.11,250, 10 మందికి రూ.9,000, 12 మంది కలిసి వెళ్తే ఒక్కొక్కరికి సుమారు రూ.7,500 మాత్రమే అవుతుంది. భోజన ఖర్చులు అదనంగా రోజుకు రూ.600 నుంచి రూ.1,000 వరకు ఉండవచ్చు. బస్సులు, టెంపో ట్రావెలర్లతో పోలిస్తే కారవాన్ ఖర్చు ఎక్కువే అయినా, ప్రైవసీ, సౌకర్యం, విశ్రాంతికి అనుకూలంగా ఉంటుంది.
Read Also: రైలు టికెట్లు బుక్ చేసేవారికి గుడ్ న్యూస్.. కొత్త IRCTC వెబ్ సైట్ వస్తోంది!