Ganesh Chaturthi Special Train List 2026: గణేష్ చతుర్థి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో గణపతి వేడులక సందర్భంగా భారీగా రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా సెంట్రల్ రైల్వే ఏకంగా 246 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక సర్వీసులతో ముంబై, కొంకణ్ ప్రాంతం, గోవా, పూణే మధ్య ప్రయాణించే భక్తులకు ఎంతో సౌకర్యం కలగనుంది.
ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి సమయంలో ముంబై నుంచి స్వస్థలాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరుగుతుంది. ముఖ్యంగా కొంకణ్ ప్రాంతానికి వెళ్లే రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను తగ్గించేందుకు అదనపు రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మొత్తం 246 ప్రత్యేక రైళ్లలో 184 రైళ్లు ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్లతో కూడిన మిశ్రమ సర్వీసులుగా నడవనున్నాయి. మరో 62 రైళ్లు పూర్తిగా రిజర్వేషన్ లేని ప్రత్యేక రైళ్లుగా అందుబాటులో ఉంటాయి. దీంతో వివిధ వర్గాల ప్రయాణికులు తమ అవసరానికి అనుగుణంగా రైళ్లను ఎంచుకునే అవకాశం ఉంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లలో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి 98 సర్వీసులు, లోక్మాన్య తిలక్ టెర్మినస్ నుంచి 76 సర్వీసులు, పూణే నుంచి 10 సర్వీసులు నడవనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు ప్రధానంగా CSMT–సావంత్వాడి రోడ్, CSMT–రత్నగిరి, LTT–సావంత్ వాడి రోడ్, LTT–రత్నగిరి, LTT–మడ్గావ్, పూణే–రత్నగిరి లాంటి ముఖ్యమైన మార్గాల్లో ప్రయాణించనున్నాయి. అటు దివా నుంచి ఖేడ్, చిప్లూన్ ప్రాంతాలకు MEMU ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేశారు. CSMT నుంచి సావంత్వాడి రోడ్ వరకు నడిచే ప్రత్యేక రైళ్లు సెప్టెంబర్ 11 నుంచి సెప్టెంబర్ 27 వరకు అందుబాటులో ఉంటాయి. అలాగే LTT నుంచి రత్నగిరి, మడ్గావ్, సావంత్వాడి రోడ్ మార్గాల్లో కూడా వివిధ తేదీల్లో ప్రత్యేక సేవలు కొనసాగుతాయి.
రిజర్వేషన్ సౌకర్యం ఉన్న ప్రత్యేక రైళ్ల టికెట్లను ప్రయాణికులు IRCTC వెబ్సైట్, రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు, రైల్ వన్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. రిజర్వేషన్ లేని టికెట్లను UTS యాప్ ద్వారా సాధారణ ఛార్జీలతో బుక్ చేసుకోవచ్చు.
కొన్ని ముఖ్యమైన ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్లు ఆగస్టు 1, 2026 నుంచి ప్రారంభం కానుంది. రైలు నంబర్లు, ప్రయాణ తేదీలు, బయలుదేరే సమయాలను ప్రయాణికులు ముందుగానే పరిశీలించుకోవాలని రైల్వే సూచించింది. పండుగ సమయంలో చివరి నిమిషంలో టికెట్లు దొరకడం కష్టంగా ఉండే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. గణేష్ చతుర్థి సందర్భంగా ప్రకటించిన ఈ 246 ప్రత్యేక రైళ్లు భక్తుల ప్రయాణ భారాన్ని తగ్గించడంతో పాటు, కుటుంబాలతో స్వస్థలాలకు వెళ్లే వారికి పెద్ద ఉపశమనంగా మారనున్నాయి.
Read Also: వైష్ణో దేవి యాత్రికులకు గుడ్ న్యూస్.. ఏకంగా 4 కొత్త వందే భారత్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!