Tatkal Tokens: రైళ్లలో తత్కాల్ టికెట్స్ బుకింగ్ విషయంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. స్టేషన్ లోని కౌంటర్లలో ఆఫ్ లైన్ బుకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా తత్కాల్ టికెట్లకు సంబంధించి టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టబోతోంది. కౌంటర్ల వద్ద రద్దీని నియంత్రించడంతో పాటు ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఇంతకీ కొత్త టోకెన్ విధానం ఏంటి? ఇది ఎలా పని చేయనుంది? ఇప్పుడు చూద్దాం.
రైల్వే శాఖ కొత్త రూల్స్ ప్రకారం.. తత్కాల్ కు సంబంధించి ఏసీ క్లాస్ టికెట్స్ టోకెన్లను ఉ.8:30 గంటల నుంచి 9:00 గంటల మధ్య జారీ చేస్తారు. అలాగే నాన్ – ఏసీ క్లాస్ టికెట్స్ ను ఉ.9:00 గంటల నుంచి 9:25 గంటల మధ్య టోకెన్లు పొందొచ్చు. స్టేషన్ లోని ప్రతీ కౌంటర్ లో ఫస్ట్ ఈజ్ ఫస్ట్ ప్రాధాన్యం కింద ఏసీ తత్కాల్ కు 10 టోకెన్లు, నాన్-ఏసీ బుకింగ్ లకు 15 టోకెన్లు ఇవ్వనున్నారు. ప్రయాణికుల డిమాండ్, స్థానిక అవసరాలను బట్టి ఈ టోకెన్ల జారీ సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చని రైల్వే వర్గాలు స్పష్టం చేశాయి.
కొత్త విధానంలో A, B కేటగిరిల కింద తత్కాల్ టికెట్ టోకెన్లను జారీ చేయనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించేవారిని కేటగిరి- A కింద పరిగణిస్తారు. మిగిలిన ప్రయాణికులను కేటగిరి – B కింద చేరుస్తారు. తొలి ప్రాధాన్యం కింద ఫ్యామిలీ ప్రయాణికులకు ఈ టోకెన్లను ఇవ్వడం జరుగుతుందని రైల్వే వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఒకరి పేరు మీద జారీ చేయబడ్డ టోకెన్ ను మరొకరికి బదిలి చేయడానికి వీలు లేదని పేర్కొన్నారు. టోకెన్ పై పేరు, సదరు వ్యక్తి గుర్తింపు కార్డును పరిశీలించి.. కౌంటర్ వద్ద తాత్కాల్ టికెట్లు జారీ చేస్తారని వివరించారు.
Also Read: ఎనర్జీ డ్రింక్ లేబుళ్లపై FSSAI నిషేధం.. కంపెనీలకు 90 రోజుల గడువు, దీని వెనుక ఏం జరిగింది?
ఇన్నాళ్లు పాటిస్తూ వచ్చిన తత్కాల్ టోకెన్ల విధానం కొత్త రూల్స్ కు భిన్నంగా ఉండేవి. ఏసీ, నాన్-ఏసీ తత్కాల్ బుకింగ్స్ కు సంబంధించిన ఆఫ్ లైన్ టోకెన్లను ఉ.8 గంటల నుంచి జారీ చేసేవారు. ఆపై ప్రయాణానికి అవసరమైన టికెట్లను ఏసీ అయితే ఉ.10 గంటలు, నాన్ ఏసీ అయితే ఉ.11 గంటలకు ఇచ్చేవారు. టోకెన్ల జారీ, టికెట్లు ఇవ్వడం మధ్య టైం గ్యాప్ ఎక్కువగా ఉండటంతో.. ప్రయాణికులు చాలా సేపు స్టేషన్లలో పడిగాపులు కాయాల్సి వచ్చేది. అయితే ఆగస్టు 1 నుంచి రాబోయే కొత్త రూల్ లో ప్రయాణికుల సమయం భారీగా ఆదా కానుంది. ఈ కొత్త విధానంలో పారదర్శకత పెరగడంతో పాటు దళారుల మోసాలకు కూడా చెక్ పెట్టినట్లు అవుతుందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read: నిక్కర్లో మూత్రం.. ప్రైవేటు పార్టుపై టీచర్ వాతలు, వారణాసిలో షాకింగ్ ఘటన