New IRCTC Website Launching on July 15: భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక సూపర్ ఫాస్ట్ టికెట్ బుకింగ్ అందుబాటులోకి రానుంది. ఇందుకోసం రైల్వే శాఖ కొత్త IRCTC వెబ్ సైట్ను జూలై 15 నాటికి ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. జైపూర్ లోని మాలవీయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MNIT)లో విద్యార్థులతో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
ప్రస్తుతం దేశంలో ఎక్కువ మంది ప్రయాణికులు రైలు టికెట్ల కోసం IRCTC ఆ న్లైన్ ప్లాట్ ఫారమ్ ను ఉపయోగిస్తున్నారు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు మరింత వేగవంతమైన, సులభమైన సేవలు అందించాలనే లక్ష్యంతో కొత్త వెబ్ సైట్ ను రూపొందిస్తున్నారు. ఈ కొత్త ప్లాట్ ఫారమ్ లో లేటెస్ట్ ఫీచర్లు, ఈజీ యూజర్ ఇంటర్ ఫేస్, పనితీరు మరింత వేగంగా ఉంటుంది.
కొత్త వెబ్ సైట్ తో పాటు భారతీయ రైల్వే తన ప్రయాణికుల రిజర్వేషన్ వ్యవస్థలో కూడా పెద్ద ఎత్తున మార్పులు తీసుకురానుంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న PRS వ్యవస్థ దాదాపు 40 ఏళ్ల నాటిది. పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా దానిని ఆధునిక టెక్నాలజీతో అప్ గ్రేడ్ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ కొత్త వ్యవస్థను ఆగస్టు నుంచి అమల్లోకి తీసుకురావాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భారతీయ రైల్వేలో ఆన్ లైన్ టికెట్ బుకింగ్ సేవలు 2002లో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మొత్తం రైలు టికెట్ల డిమాండ్ లో దాదాపు 88 శాతం ఆన్ లైన్ ద్వారానే జరుగుతోంది. దీంతో సర్వర్ పై భారీ ప్రెజర్ పెరుగుతోంది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని కొత్త PRS వ్యవస్థను రూపొందిస్తున్నారు.
కొత్త రిజర్వేషన్ వ్యవస్థతో టికెట్ బుకింగ్ సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతం నిమిషానికి సుమారు 32 వేల టికెట్లు బుక్ చేయగలుగుతుండగా, కొత్త వ్యవస్థలో ఈ సంఖ్య 1.5 లక్షలకు పైగా పెరగనుంది. అంటే, ఇప్పటి కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ సామర్థ్యం లభిస్తుంది. టికెట్ బుకింగ్ మాత్రమే కాకుండా, రైలు వివరాలు, సీట్ల లభ్యత, ప్రయాణ సమాచారం లాంటి అంశాల కోసం చేసే విచారణల సామర్థ్యం కూడా భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం నిమిషానికి 4 లక్షల వరకు విచారణలను స్వీకరించే అవకాశం ఉంటుంది. కొత్త ప్లాట్ ఫారమ్ లో 40 లక్షలకు పైగా విచారణలను తీసుకుంటుందని రైల్వేశాఖ ప్రకటించింది.
ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేలా కొత్త PRSలో పలు ప్రత్యేక ఫీచర్లు రాబోతున్నాయి. ప్రయాణికులు తమకు నచ్చిన సీటును ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే పలు తేదీల్లో టికెట్ ధరలను ఒకేసారి చూసే ఫేర్ క్యాలెండర్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. దివ్యాంగులు, విద్యార్థులు, రోగులు లాంటి ప్రత్యేక వర్గాల కోసం అవసరమైన సర్వీసులను ఇందులో పొందుపరుస్తారు.
ఇక ఇప్పటికే రైల్వే “రైల్ వన్” అనే సూపర్ యాప్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలను అంచనా వేసి ప్రయాణికులకు సమాచారం అందిస్తుంది. ఒకే యాప్ లో అన్ని రకాల అనేక రైల్వే సేవలను పొందే అవకాశం ఉంటుంది. కొత్త IRCTC వెబ్ సైట్, అత్యాధునిక PRS వ్యవస్థ అమల్లోకి వస్తే టికెట్ బుకింగ్ ప్రక్రియ మరింత వేగవంతం కావడంతో పాటు ప్రయాణికులు మెరుగైన డిజిటల్ ఎక్స్ పీరియెన్స్ ను అందించనుంది.
Read Also: కాశ్మీర్-లడఖ్ కు 365 రోజుల కనెక్టివిటీ.. జోజిలా టన్నెల్ తవ్వకం పూర్తి!