‘నీరు పల్లమెరుగు’ అనే మాట అందరికీ తెలిసిందే. నీళ్లు ఎప్పుడూ పైనుంచి కిందికే ప్రవహిస్తుంది. అది ప్రకృతి నియమం. కానీ, ఓ గ్రామంలో ప్రకృతికి విరుద్ధంగా నీరు కింది నుంచి పైకి ప్రవహిస్తుంది. ఆ ప్రాంత ప్రజలు ఈ ప్రదేశాన్ని ‘ఉల్టా పానీ’ అని పిలుస్తున్నారు. దీన్ని చూసేందుకు నిత్యం వందలాది మంది పర్యాటకులు తరలివస్తున్నారు. అద్భుతమైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.
ఈ విచిత్ర ప్రదేశం ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని సుర్గుజా జిల్లాలో ఉంది. బిసార్ పాని గ్రామంలో మైన్ పట్ అనే అందమైన కొండ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతాన్ని ప్రజలు ‘ఛత్తీస్గఢ్ సిమ్లా’గా పిలుస్తారు. ఎందుకంటే, ఇది సిమ్లా లాగానే చల్లగా, పచ్చగా, కొండలతో నిండి ఉంటుంది.
బిసార్ పాని గ్రామంలోని మైన్ పట్ ప్రాంతంలో ఉల్టా పానీ ఉంటుంది. ఓ కాలువలోని నీళ్లు కింది నుంచి కొండ మీదికి ఎగబాకుతాయి. ఇక్కడ నీళ్లు పోసినా కూడా కిందికి బదులుగా పైకి ప్రవహిస్తుంటాయి. ఈ దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. పిల్లలు, పెద్దలు ఈ అద్భుతాన్ని చూసి మైమరచిపోతారు.
ఈ వింత వెనుక కారణాన్ని తెలుసుకునేందుకు చాలా మంది ప్రయత్నించారు. కానీ, అసలు విషయాన్ని పక్కాగా కనిపెట్టలేకపోయారు. భూమికి ఉన్న గ్రావిటీ కారణంగానే ఈ విధంగా జరుగుతుందని చాలా మంది భావిస్తారు. మరో వైపు ఇదో ఆప్టికల్ భ్రమ అని మరికొంత మంది చెప్తుంటారు. కిందికి కనిపించే ప్రదేశం వాస్తవానికి పైకి ఉంటుందని.. నీరు కిందికి ప్రవహించినప్పుడు, అది పైకి వెళ్తున్నట్లు కనిపిస్తుందని చెప్తుంటారు. ప్రకృతి ఇక్కడ చాలా తెలివైన ట్రిక్ ప్లే చేస్తుందంటారు. అదే సమయంలో నీరు పై ప్రాంతాలకు ప్రవహించడం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదంటారు ఉల్టా పానీని చూసేందుకు వచ్చే టూరిస్టులు.
మైన్ పట్ రివర్స్ వాటర్ గురించి మాత్రమే కాదు. ఈ ప్రదేశంలో చాలా అద్భుతాలు ఉన్నాయి.
⦿ టైగర్ పాయింట్- ఇక్కడ అందమైన జలపాతం ఉంటుంది.
⦿ జల్జలి- ఈ ప్రదేశంలో పైకి ఎగిరి దూకితే భూమి కాస్త కదిలిన ఫీలింగ్ కలుగుతుంది.
⦿ మెహతా పాయింట్- సూర్యోదయం, సూర్యాస్తమయాల అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి.
⦿ టిబెటన్ దేవాలయాలు, కార్పెట్ దుకాణాలు- ఈ ప్రదేశంలో పలు టిబెటన్ కుటుంబాలు నివసిస్తాయి. చేతితో తయారు చేసిన రంగురంగుల కార్పెట్లను ఇక్కడ అమ్ముతారు.
⦿ పచ్చని పచ్చిక బయళ్ళు, పైన్ అడవులతో ఏడాది పొడవునా చల్లని వాతావరణం ఉంటుంది.
⦿ ఈ ప్రాంతం రాయ్ పూర్ విమానాశ్రయానికి సుమారు 380 కి.మీ దూరంలో ఉంటుంది.
⦿సమీప రైల్వే స్టేషన్ అంబికాపూర్. సుమారు 85 కి.మీ దూరంలో ఉంటుంది.
⦿ అంబికాపూర్ నుంచి మైన్ పట్ కు బస్సు, టాక్సీలో వెళ్లొచ్చు. సుమారు 2-3 గంటలు పడుతుంది.
⦿ ఉల్టా పానీ మైన్ పట్ పట్టణం నుంచి కేవలం 12 కి.మీ దూరంలో ఉంటుంది.
ఈ ప్రదేశాన్ని అక్టోబర్ నుంచి మార్చి వరకు సందర్శిస్తే చాలా బాగుంటుంది. ఇక్కడి వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.
Read Also: 300 టన్నుల బంగారంతో సొరంగంలోకి వెళ్లి మాయమైన రైలు, 80 ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నారు!