DGCA Refund Rules : విమాన ప్రయాణికులు ఎదుర్కొంటున్న రీఫండ్ సమస్యలను పరిష్కరించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) చర్యలు చేపట్టింది. ఈ మేరకు నిబంధనలు సవరించింది. ఈ సవరించిన నిబంధనలు మార్చి 26, 2026 నుండి అమలులోకి రానున్నాయి. దేశీయ, అంతర్జాతీయ విమాన సంస్థలతో పాటు భారత్ నుండి నడిచే విదేశీ విమానయాన సంస్థలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. ప్రయాణికుల ఫిర్యాదులను పరిష్కరించడం, రీఫండ్ ప్రక్రియను వేగవంతం చేయడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యమని డీజీసీఏ పేర్కొంది.
టిక్కెట్ బుక్ చేసిన 48 గంటల్లోపు ఎటువంటి అదనపు రుసుము లేకుండా రద్దు లేదా సవరణ చేసుకోవచ్చు. అయితే బుకింగ్ సమయంలో ప్రయాణ తేదీ దేశీయ విమానాలకు కనీసం 7 రోజులు, అంతర్జాతీయ విమానాలకు 15 రోజుల ముందు ఉండాలి. ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసినా సరే ఎయిర్లైన్స్ 14 పని దినాలలోపు రీఫండ్ పూర్తి చేయాలి. క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించిన మొత్తాన్ని ఏడు రోజుల్లోపు తిరిగి ఇవ్వాలి. రీఫండ్ ప్రక్రియ కోసం విమాన సంస్థలు ఎటువంటి ప్రత్యేక రుసుము వసూలు చేయకూడదు. పేరులో తప్పులు దొర్లితే బుకింగ్ చేసిన 24 గంటల్లోపు ఉచితంగా సరిదిద్దుకోవచ్చు.
నాన్-రిఫండబుల్ టిక్కెట్లపై కూడా విమాన సంస్థలు అన్ని రకాల చట్టబద్ధమైన పన్నులు, ప్యాసింజర్ సర్వీస్ ఫీజులను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికులు లేదా కుటుంబ సభ్యుల వైద్య అత్యవసర కారణాల వల్ల టిక్కెట్ రద్దు చేస్తే రీఫండ్ లేదా క్రెడిట్ షెల్ అందించే వెసులుబాటు కల్పించారు. టిక్కెట్ రద్దు ఛార్జీలు బుకింగ్ సమయంలోనే స్పష్టంగా తెలియజేయాలి. ఈ ఛార్జీలు ప్రాథమిక ఛార్జీ (Basic Fare), ఇంధన సర్చార్జ్ కంటే ఎక్కువగా ఉండకూడదు.
అయితే 48 గంటల గడువు తర్వాత రద్దు చేస్తే విమాన సంస్థల సాధారణ నిబంధనలే వర్తిస్తాయి. ప్రయాణ తేదీలలో మార్పులు చేసినప్పుడు పాత టిక్కెట్ ధర కంటే కొత్త టిక్కెట్ ధర ఎక్కువగా ఉంటే ఆ ఛార్జీలను ప్రయాణికుడే చెల్లించాల్సి ఉంటుంది. రీఫండ్ మొత్తానికి సంబంధించిన పూర్తి వివరాలను టిక్కెట్ పైన లేదా విమాన సంస్థల వెబ్సైట్లలో స్పష్టంగా ప్రదర్శించాలని డీజీసీఏ ఆదేశించింది.
Read Also: Air India Offers: జస్ట్ రూ.1450కే ప్లైట్ టికెట్.. ఎయిర్ ఇండియా క్రేజీ ఆఫర్!