Hussainiwala Station: సాధారణంగా రైల్వే స్టేషన్ అంటేనే కిటకిటలాడే ప్రయాణికులు, అనౌన్స్మెంట్లు, హడావిడి గుర్తుకొస్తాయి. కానీ, మన దేశంలో ఒక విచిత్రమైన రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ ఏడాది పొడవునా ప్లాట్ఫారమ్లు ఖాళీగా ఉంటాయి, పట్టాల మీద తుప్పు పడుతుంటుంది. కానీ సరిగ్గా ఏడాదికి రెండు సార్లు మాత్రమే ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక రైలు అక్కడికి వస్తుంది. అదే పంజాబ్ సరిహద్దుల్లోని హుస్సేనీవాలా రైల్వే స్టేషన్.
పంజాబ్లోని ఫిరోజ్పుర్ జిల్లాలో భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న హుస్సేనీవాలా రైల్వే స్టేషన్ భారత రైల్వే వ్యవస్థలోనే అత్యంత ప్రత్యేకమైనది. సాధారణంగా రైల్వే స్టేషన్లు నిత్యం రద్దీగా ఉంటాయి.. కానీ ఈ స్టేషన్కు మాత్రం ఏడాదికి కేవలం రెండు సార్లు మాత్రమే రైలు వస్తుంది. మిగిలిన 363 రోజులు ఈ స్టేషన్ నిర్మానుష్యంగా, ఎటువంటి రైలు రాకపోకలు లేకుండా ఉంటుంది.
ఈ స్టేషన్కు రైళ్లు వచ్చే ఆ రెండు రోజులు భారత చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత కలిగినవి. మొదటిది, మార్చి 23న భారత వీర జవాన్లు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురుల వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పించేందుకు రైలు నడుపుతారు. రెండోది, ఏప్రిల్ 13న వైశాఖి పండుగ వేళ ప్రజల సౌకర్యార్థం ఇక్కడ రైలు ఆగుతుంది. ఈ రెండు సందర్భాల్లో మాత్రమే ఈ స్టేషన్ ప్రయాణికులతో సందడిగా కనిపిస్తుంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రైళ్లు నడవని రోజుల్లో స్థానిక ప్రజలు ఈ రైల్వే పట్టాలను ఒక రోడ్డు మార్గంగా ఉపయోగిస్తారు. ట్రాక్ పైన మట్టి పేరుకుపోయి, వాహనాలు వెళ్లడానికి వీలుగా అది మారిపోయింది. ఒకప్పుడు భారత్-పాక్ మధ్య వాణిజ్యానికి కీలకమైన ఈ మార్గం, 1971 యుద్ధం తర్వాత మూతపడింది. ప్రస్తుతం ఇది కేవలం ఒక చారిత్రక స్మారకంగా, సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే పనిచేసే అరుదైన స్టేషన్గా మిగిలిపోయింది. దీని గురించి ఇటీవల ఓ సోషల్ మీడియా వ్లాగర్ వీడియో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది.
ఆ రైల్వేస్టేషన్కు ఏడాదికి రెండు రైళ్లే.. అది ఎక్కడుందంటే!
పంజాబ్లోని ఫిరోజ్పుర్-హుస్సేనీవాలా సరిహద్దులో ఉన్న హుస్సేనీవాలా రైల్వే స్టేషన్ విశేషాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భారత్లో ఏడాదికి కేవలం రెండు రోజులు మాత్రమే రైలు వచ్చే ఏకైక స్టేషన్ ఇది. మార్చి 23న భగత్ సింగ్ వర్ధంతి… pic.twitter.com/wlDHdrqWFo
— ChotaNews App (@ChotaNewsApp) March 25, 2026