దేశ వ్యాప్తంగా రైళ్ల వేగాన్ని పెంచేందుకు భారతీయ రైల్వే ట్రాక్ అప్ గ్రేడ్స్ చేస్తుంది. అందులో భాగంగానే సౌత్ వెస్ట్రన్ రైల్వే (SWR) రద్దీగా ఉండే అంతర్ రాష్ట్ర మార్గాల్లో స్పీడ్ అప్ గ్రేడ్ ను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రైలు ప్రయాణాలు మరింత వేగవంతం కానున్నాయి. అక్కడక్కడా మిగిలిపోయిన ట్రాక్ అప్ గ్రేడ్ పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. హైదరాబాద్ నుంచి బయల్దేరే రైళ్లు వచ్చే నెల నుంచి మరింత వేగంతో ప్రయాణించనున్నాయి. రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.
ఆంధ్రప్రదేశ్ లోని మకాజిపల్లి, ధర్మవరం మధ్య కీలకమైన 30 కిలోమీటర్ల దూరం ఇప్పుడు అడ్ డేట్ అయ్యింది. హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్లే రైళ్లు ఇక మరింత వేగంగా ప్రయాణించనున్నాయి. ఇందుకు సంబంధించి రైల్వే భద్రతా కమిషనర్ కొత్తగా వేసిన ట్రాక్పై గరిష్టంగా 110 కి.మీ. వేగంతో రైళ్లు ప్రయాణించేందుకు అనుమతి ఇచ్చారు. ట్రయల్ రన్ సమయంలో, రైళ్లను గంటకు 121 కి.మీ. వేగంతో నడిపారు. ఈ నేపథ్యంలో పెనుకొండ-ధర్మవరం డబ్లింగ్ ప్రాజెక్ట్ ముగింపు దశకు చేరాయి. ఈ మార్గం మరింత బలోపేతం కానుంది.
ఇక ఈ ప్రాంతంలో రెండవ లైన్ వేయడంతో పాటు, రైల్వే 66 చిన్న వంతెనలు, 15 రోడ్ అండర్ పాస్ లు , ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించింది. స్టేషన్ యార్డ్ ను ఐదు లైన్లుగా విస్తరించింది. ఈ అప్ డేట్స్ మరింత సున్నితమైన క్రాసింగ్స్ కు అవకాశం కల్పించనున్నాయి. అదే సమయంలో ఈ కారిడార్ హైదరాబాద్ వైపు నుంచి బయలుదేరే రైళ్ల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తాయి.
రైల్వే ఇంజనీర్లు యెలహంక-ధర్మవరం విభాగాన్ని కూడా గంటకు 130 కి.మీ వేగంతో రైళ్లు పరుగులు తీసేలా ట్రాక్ ను అప్ గ్రేడ్ చేస్తున్నారు. 161 కిలోమీటర్ల కారిడార్ మార్చి నాటికి ఈ సామర్థ్యాన్ని సాధిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పనులు పూర్తి అయిన తర్వాత యశ్వంత్పూర్-కాచిగూడ వందే భారత్ ఎక్స్ ప్రెస్ తో సహా హైదరాబాద్ నుంచి బయల్దేరే సుదూర, ప్రీమియం సర్వీసులకు మరింత లాభం చేకూరనుంది. డబుల్ ట్రాకింగ్ తో ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
ట్రాక్ డబుల్ చేయడం వల్ల క్రాసింగ్ పాయింట్ల దగ్గర క్లియరెన్స్ కోసం వేచి ఉండే అవసరం ఇకపై ఉండదు. రెండు ట్రాక్ లు అందుబాటులో ఉండటంతో, హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు బయలుదేరే రైళ్లు స్థిరమైన వేగాన్ని, మెరుగైన సమయపాలనను కొనసాగిస్తాయి. వారాంతాల్లో, సెలవు దినాలలో విద్యార్థులు, ఐటీ నిపుణులు, వ్యాపార ప్రయాణికులకు మంచి ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి. ఈ అప్ గ్రేడ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య రైలు లింక్ను బలోపేతం చేస్తుంది.
Read Also: గూడ్స్ రైలు బ్రేకులు ఫెయిల్.. 75 కి.మీ వేగంతో పరుగులు, చివరికి ఏం జరిగిందంటే?