దేశ వ్యాప్తంగా హైస్పీడ్ రైల్వే కారిడార్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే అహ్మదాబాద్-ముంబై మధ్య బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణ పనులు కొనసాగుతుండగా, నెమ్మదిగా దేశమంతా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా చేపట్టే హై స్పీడ్ రైల్వే నెట్ వర్క్ లో హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా అవతరించబోతోంది. 2026 కేంద్ర బడ్జెట్లో కేంద్రం కొత్త బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ను చెన్నై, బెంగళూరు, ముంబై లాంటి ప్రధాన నగరాలకు అనుసంధానించనున్నట్లు వెల్లడించింది. దీని ద్వారా రైళ్లు గంటకు 350 కి.మీ వేగంతో నడపడానికి వీలు కలగనుంది.
ప్రస్తుతం ముంబై- అహ్మదాబాద్ మధ్య తొలి హై స్పీడ్ రైలు కారిడార్ నిర్మాణం జరుగుతోంది. అదే సమయంలో దేశ వ్యాప్తంగా ఏడు కొత్త హై స్పీడ్ రైలు కారిడార్లను కూడా కేంద్రం ఆమోదించింది. ఈ కారిడార్లలో మూడు హైదరాబాద్ నుంచే ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ నుంచి వెళ్లే మూడు కారిడార్లు చెన్నై, బెంగళూరు, ముంబైతో కలపనున్నాయి. హైదరాబాద్-ముంబై కారిడార్ కోసం DPR ఇప్పటికే రైల్వే బోర్డుకు సమర్పించబడింది. ఈ కారిడార్ ఇప్పుడు రెండు ప్రాజెక్టులుగా విభజించబడింది. హైదరాబాద్-పూణే, పూణే-ముంబై, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు మార్గాలకు DPRలు కూడా ఖరారు అవుతున్నాయి.
ప్రస్తుతం దేశంలో అత్యంత వేగవంతమైన రైళ్లలో రాజధాని, శతాబ్ది, వందే భారత్ సేవలు ఉన్నాయి. వందే భారత్ చైర్ కార్ రైళ్లు గంటకు గరిష్టంగా 150 కి.మీ వేగంతో నడుస్తాయి. వందేభారత్ స్లీపర్ రైళు 180 కిలో మీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. ప్రతిపాదిత హై స్పీడ్ రైలు కారిడార్లను గంటకు 350 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణాలు కొనసాగేలా రూపొందించారు. వీటి ఆపరేషనల్ వేగం గంటకు 320 కి.మీ. ఉంటుంది. మలుపులు, స్టాప్ లు, ఇతర భద్రతా అంశాలను పరిగణలోకి తీసుకుంటే సగటు వేగం 250 కి.మీ వరకు ఉంటుంది.
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పూణేకు రైలు ప్రయాణాలకు సమయం దాదాపు 12 నుంచి 15 గంటలు పడుతుంది. హై స్పీడ్ రైలుతో, ఈ నగరాలను కేవలం మూడున్నర గంటల్లో చేరుకోవచ్చు. హైదరాబాద్కు దగ్గరగా ఉన్న నగరాలకు మరింత వేగంగా వెళ్లే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నుంచి కర్నూలు, అమరావతికి ప్రయాణ సమయం వరుసగా గంటా 75 నిమిషాల్లో పూర్తవుతుంది. అనంతపురం దాదాపు 90 నిమిషాల్లో చేరుకోవచ్చు.
ప్రతిపాదిత కారిడార్లలో చిన్న పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో కూడా స్టాప్లు ఉంటాయి. తెలంగాణలో, శంషాబాద్, వనపర్తి రోడ్, మహబూబ్నగర్, నార్కట్ పల్లి, సూర్యాపేట, ఖమ్మం లాంటి ప్రదేశాల్లో స్టేషన్లను ప్లాన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో, చీరాల, కావలి, గూడూరు లో స్టేషన్లను ప్రతిపాదించారు. ఈ హై స్పీడ్ రైలు మార్గాలు పూర్తిగా కొత్తగా నిర్మాణం కానున్నాయి. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులు, ప్రస్తుత రైల్వే ట్రాక్ల నుంచి విడిగా నిర్మించబడతాయి. పశువులు, అడవి జంతువులు ట్రాక్లలోకి రాకుండా ఫెన్సింగ్, ఇతర భద్రతా చర్యలు ఏర్పాటు చేయబడతాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత, హైదరాబాద్, సమీపంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. అదే సమయంలో ఆర్థిక కార్యకలాపాలు, ప్రాంతీయ అభివృద్ధిని పెంచనున్నాయి.
Read Also: వందేభారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్.. రైల్వేశాఖ సంచలన నిర్ణయం!