భారతదేశం గొప్ప సంస్కృతి, చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాల కోసం ప్రసిద్ధి. అందుకే ప్రపంచ దేశాల నుంచి పర్యాటకులు భారీ సంఖ్యలో మన దేశానికి వస్తుంటారు. అయినప్పటికీ క్లిష్టమైన వీసా విధానాలు, ఎక్కువ సమయం పట్టే అనుమతి ప్రక్రియలు విదేశీ పర్యాటకులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి.
ఈ సమస్యను పరిష్కరించి పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం నీతి ఆయోగ్ పలు కీలక సూచనలు చేసింది. ఈ మార్పులు అమల్లోకి వస్తే భారత్కు రావడం విదేశీయులకు మరింత సులభమవుతుంది.
ఇటీవల నీతి ఆయోగ్ ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో ఇండియాలో పర్యాటక రంగానికి అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అయితే ప్రస్తుతం ఉన్న నిబంధనలు, అనుమతి ప్రక్రియలు అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నాయని తెలిపింది. అందుకే కొన్ని దేశాల పౌరులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని విస్తరించాలని సూచించింది.
అదే సమయంలో హోటళ్లకు సంబంధించిన నిబంధనలను సులభతరం చేయాలని, లైసెన్స్ ప్రక్రియను కూడా సరళీకరించాలని సిఫార్సు చేసింది.
కొన్ని ఎంపిక చేసిన దేశాల పౌరులకు 90 రోజుల మల్టిపుల్ ఎంట్రీ ‘వీసా ఆన్ అరైవల్’ ఇవ్వాలని నివేదిక సూచించింది. దీంతో ప్రయాణికులు ముందుగానే వీసా కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉండదు. భారత్లోని విమానాశ్రయం లేదా సముద్ర నౌకాశ్రయానికి చేరుకున్న తర్వాతే విదేశీయులు వీసా పొందవచ్చు. అలాగే ప్రస్తుతం ఉన్న ‘ఈ వీసా’ విభాగాలను తగ్గించి దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని కూడా సూచించింది.
ప్రస్తుతం భారత్ కేవలం మూడు దేశాల పౌరులకు మాత్రమే వీసా ఆన్ అరైవల్ సౌకర్యం అందిస్తోంది. ఆ దేశాలు జపాన్, దక్షిణ కొరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ). అయితే యూఏఈ పౌరులకు ఈ సౌకర్యం కొన్ని ప్రత్యేక నిబంధనల కింద మాత్రమే అందుబాటులో ఉంటుంది.
నేపాల్, భూటాన్ దేశాల పౌరులు వీసా లేకుండానే భారత్లోకి ప్రవేశించవచ్చు. ఈ రెండు దేశాలతో భారత్కు ఉన్న ప్రత్యేక దౌత్య, సాంస్కృతిక సంబంధాల కారణంగా ఈ సౌకర్యం కొనసాగుతోంది.
భారతీయ పాస్పోర్ట్ కలిగిన వారికి ప్రస్తుతం సుమారు 55 నుంచి 56 దేశాల్లో వీసా ఫ్రీ, వీసా ఆన్ అరైవల్ లేదా ‘ఈ ట్రావెల్’ అథరైజేషన్ సౌకర్యాలు ఉన్నాయి. దీంతో భారతీయులు ముందస్తు వీసా ప్రక్రియ లేకుండానే అనేక దేశాలను సందర్శించే అవకాశం పొందుతున్నారు.
Also Read: ఇండియాలోనే యూరోప్ దేశాల అందాలు.. వర్షాకాలంలో స్విట్జర్లాంట్, స్కాట్లాండ్ను తలపించే ప్రాంతాలు
వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని విస్తరిస్తే విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, విమానయాన సంస్థలు, స్థానిక వ్యాపారాలకు ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో పర్యాటక రంగంలో కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఈ చర్యలు భారత్ను ప్రపంచ స్థాయి ట్రావెల్ డెస్టినేషన్గా మరింత బలపరచగలవు.
నీతి ఆయోగ్ తన సూచనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం ఇంకా ప్రకటించలేదు. అయితే వీటికి ఆమోదం లభిస్తే భవిష్యత్తులో మరిన్ని దేశాల పౌరులకు భారత్లోకి రావడం మరింత సులభమవుతుంది.