Telangana Sports: 2036 లో ఒలింపిక్స్ క్రీడలను నిర్వహించాలని భారతదేశం పోటీ పడుతున్న నేపథ్యంలో ఆ క్రీడల నిర్వహణకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వాలన్న బలమైన ఆకాంక్షను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. ఆ క్రీడల నిర్వహణకు అనుగుణంగా తెలంగాణ, హైదరాబాద్ నగరాన్ని అన్ని రకాలుగా సర్వసన్నద్ధం చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ క్రీడా వైభవం నూతన అధ్యాయానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. గచ్చీబౌలి స్టేడియం వేదికగా ముఖ్యమంత్రి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి గచ్చీబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి శుభారంభం పలికారు.
మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) ఏపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు, అధికారులు, విద్యార్థుల సమక్షంలో వాటికి శ్రీకారం చుట్టారు. క్రీడలను ప్రోత్సహించాలన్న బలమైన ఆకాంక్షతో స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపించడం పట్ల ఈ సందర్భంగా పీటీ ఉష ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వచ్చే నవంబర్లో ఖేలో ఇండియా పోటీలను నిర్వహించడమే కాకుండా 2036 ఒలింపిక్స్ నిర్వహించాలని భారతదేశం భావిస్తున్న నేపథ్యంలో అందుకు తెలంగాణ వేదిక కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
82 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో స్పోర్ట్స్ యూనివర్సిటీని, ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ అకాడమీని ఇక్కడ నిర్మించబోతున్నాం. 2028 డిసెంబరులో ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించుకోబోతున్నాం అని తెలిపారు. క్రీడారంగంలో స్పష్టమైన విధానం లేని కారణంగా క్రీడల్లో దేశం వెనుకబడిపోయింది. అందుకే తెలంగాణలో స్పష్టమైన క్రీడా పాలసీని తెచ్చాం. దేశంలో క్రీడా శిక్షణా కేంద్రాలు, యూనివర్సిటీలకు పాలసీ ఉండాలి. స్వాతంత్య్రోద్యమ కాలంలో యంగ్ ఇండియా పేరుతో మహాత్మాగాంధీ నడిపిన యంగ్ ఇండియా దినపత్రిక స్ఫూర్తిగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం అని వివరించారు.
Also Read: Home Guards: హోంగార్డులకు గుడ్ న్యూస్.. కేంద్రం సంచలన నిర్ణయం!
ఆఫ్రోఏషియన్ క్రీడలు, ప్రపంచ మిలిటరీ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు వేదికగా ఉన్న హైదరాబాద్ ఆ తర్వాత గడిచిన 20 ఏళ్లపాటు చెప్పుకోదగిన క్రీడలను నిర్వహించలేదు. 23 ఏళ్ల కిందట నిర్మించిన స్టేడియాలు ఆ తర్వాత పెళ్లిళ్లకు, రాజకీయ కార్యక్రమాలకు వేదికగా ఉపయోగించారు. వాటన్నింటినీ పునరుద్ధరించాలని భావిస్తున్నాం అని స్పష్టం చేశారు. నిజమైన క్రీడాకారులను సంపూర్ణమైన ప్రోత్సాహకాలను అందించడానికి స్పోర్ట్స్ పాలసీతో పాటు పబ్లిక్ – ప్రైవేట్ భాగస్వామ్యంలో క్రీడా యూనివర్సిటీని నెలకొల్పాం. ఇందులో ప్రభుత్వం జోక్యం ఉండదు. సంజయ్ గోయంకా, అభినవ్ బింద్రా, కపిల్ దేవ్, కావ్యా మారన్, ఉపాసన రామ్ చరణ్, రవికాంత్ రెడ్డి లాంటి క్రీడలను ప్రోత్సహిస్తున్న వారితో యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఈ వర్సిటీ నిర్వహణ విషయంలో వారికే పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం అని తెలిపారు.
చదువులోనే కాదు, క్రీడల్లో రాణించినా భవిష్యత్తు బాగుంటుందని, క్రీడలపై దృష్టి సారించండి. క్రీడల్లో రాణించి దేశానికి ప్రతిష్ట తీసుకొస్తే అలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే బాధ్యతను తెలంగాణ తీసుకుంటుందని ప్రకటించారు. యువకులు ఈ దేశ సంపద. ఒలింపిక్స్, ఇతర క్రీడలు జరిగినప్పుడు ఏ దేశాలు ఎన్ని గెలిచాయని గమనించినప్పుడు భారతదేశం చివరిస్థానాల్లో నిలుస్తోంది. క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించే విషయంలో పీటీ ఉష లాంటి వారు మాకు అవసరమైన సహకారం అందించాలి. పీటీ ఉష నుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది. క్రీడల్లో రాణించడం వల్లే ఈ రోజు రాజ్యసభ సభ్యులు అని చెప్పారు.
Also Read: Revanth Grandson: మనవడి కోసం పూరీలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి!
ఏ రంగంలోనైనా ఉత్తమంగా రాణించాలంటే ఏకాగ్రత ఉండాలి. అప్పుడే రాణించగలుతాం. వందకు వంద శాతం సాధన చేయాలి. ఒకసారి ఓటమి చెందినంత మాత్రాన కుంగిపోవలసిన అవసరం లేదు. ఒక ఓటమి మనల్ని నిరాశపరచకూడదు. ఓటమిని సవాలుగా తీసుకోవాలి అని ముఖ్యమంత్రి ఉద్బోధించారు. వివిధ క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచిన తెలంగాణకు చెందిన ఆరుగురు క్రీడాకారులకు రూ. 7.15 కోట్ల మేరకు నగదు ప్రోత్సాహకాలను ఈ సందర్భంగా వారికి అందించారు. దీప్తి దివాంజీ (ప్యారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్) కి రూ. 50 లక్షలు, దనుష్ శ్రీకాంత్ (షూటింగ్ – డెఫ్లింపిక్స్) కు రూ. 2.10 కోట్లు, ఈషా సింగ్ (ISSF ప్రపంచకప్ విజేత – వరల్డ్ రికార్డు) కు రూ. 3.3 కోట్లు, నిఖత్ జరీన్ (బాక్సింగ్) కు రూ. 60 లక్షలు, తనిష్క్ మురళీధర్ నాయుడు (షూటింగ్) కు రూ. 53.65 లక్షలు, రావూరి సురభి భరద్వాజ్ (షూటింగ్) కు రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకాలకు సంబంధించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా చెక్కులను అందించారు.
రాబోవు రోజుల్లో తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్న టోర్నమెంట్స్, లీగ్స్ వివరాలను ఈ వేదికగా ప్రకటించారు. 2026 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (8వ ఎడిషన్) క్రీడలు, జాతీయ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్ టోర్నమెంట్స్ను తెలంగాణ నిర్వహించబోతోంది. వీటితో పాటు హాకీ ఇండియా లీగ్, ప్రపంచ పికిల్బాల్ లీగ్, ఆర్చరీ ప్రీమియర్ లీగ్, టెన్నిస్ ప్రీమియర్ లీగ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇదే సందర్భంగా ముఖ్యమంత్రి Telangana Sports Knowledge on Wheels స్పోర్ట్స్ నాలెడ్జ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Also Read: Basti Dawakhanas: ఈ నెల 10వ తేదీ నుంచే అసలైన ఆట.. మంత్రి పొన్నం మాస్ వార్నింగ్!