Trains Cancellations in May 2026: ఈ నెలలో రైలు ప్రయాణం చేయాలనుకుంటున్నవారిని రైల్వేశాఖ అలర్ట్ చేసింది. రైల్వే పనుల కారణంగా పలు రైళ్లను క్యాన్సిల్ చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను దారిమళ్లించినట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పూర్ స్టేషన్ లో జరుగుతున్న పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే వెల్లడించింది. యార్డ్ పునర్నిర్మాణం భాగంగా కీలక పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. రైళ్ల రాకపోకలు మరింత వేగంగా, సజావుగా సాగేందుకు నాన్-ఇంటర్లాకింగ్ పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పనుల కారణంగా 40కి పైగా రైళ్లు ఎఫెక్ట్ అవుతున్నట్లు వెల్లడించారు.
తాజా మార్పుల కారణంగా కొన్ని రైళ్లను దారి మళ్లించడం, కొన్ని స్టేషన్లలో ఆగకపోవడం, ఇంకొన్ని రైళ్లను మధ్యలోనే నిలిపివేయడం, రద్దు చేయడం కొనసాగించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వీటిలో వందేభారత్ రైలు కూడా ఉన్నట్లు వెల్లడించారు. 22435 పాట్నా–గోమతినగర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ కొద్ది రోజుల పాటు కొత్త మార్గంలో నడవనుంది. పాత మార్గం జాఫరాబాద్–షాహగంజ్–అయోధ్య కాగా, ఇప్పుడు జాఫరాబాద్–సుల్తాన్పూర్–అయోధ్య కంటోన్మెంట్ మార్గంలో ప్రయాణించనుంది. ఈ సమయంలో అయోధ్య ధామ్ స్టేషన్ లో ఈ రైలు ఆగదు.
పలు ముఖ్య రైళ్లు కూడా దారిమళ్లింపును కొనసాగిస్తున్నాయి. బల్లియా–ఆనంద్ విహార్, సూరత్–ఛప్రా, బరౌని–గోండియా, లోకమాన్య తిలక్–గోరఖ్పూర్, షాలిమార్–గోరఖ్పూర్ లాంటి ఎక్స్ ప్రెస్ రైళ్లపైనా ఈ ప్రభావం పడనుంది. వీటిలో చాలా రైళ్లు జౌన్ పూర్, జంగై, మరియాహు లాంటి స్టేషన్లలో ఆగకుండా వెళ్లిపోతాయి. దారి మళ్లింపుల కారణంగా పలు స్టేషన్లలో హాల్టింగ్ రద్దు చేశారు. జౌన్ పూర్, జాఫరాబాద్, మరియాహు, జంగై, ప్రయాగ్రాజ్ ఛెయోకి, వింధ్యాచల్, మిర్జాపూర్, షాహగంజ్ లాంటి స్టేషన్లలో కొన్ని రైళ్లు ఆగవు. అందువల్ల ఈ స్టేషన్ల నుంచి ప్రయాణం చేసే వారు ముందుగా తమ రైలు వివరాలు చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఇక కొన్ని MEMU రైళ్లు కూడా పూర్తిగా నడవడం లేదు. ఘాజీపూర్ సిటీ–జౌన్ పూర్ రూట్ లో నడిచే కొన్ని రైళ్లు ముఫ్తీగంజ్ వరకు మాత్రమే పరిమితం అవుతాయి. కొన్ని తేదీల్లో ఈ రూట్ లో రైళ్లు పూర్తిగా రద్దు అయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు కీలక సూచనలు చేశారు. స్టేషన్కు వెళ్లే ముందు ఆన్ లైన్ లో రైలు స్టేటస్ తెలుసుకోవాలన్నారు. రైలు రూట్, ఆగే స్టేషన్లు మారాయా? లేదా? అనేది చెక్ చేసుకోవాలన్నారు. అవసరమైతే అదనపు సమయం కేటాయించాలన్నారు. చివరి నిమిషంలో ఇబ్బందులు రాకుండా ముందుగానే పూర్తి వివరాలను తెలుసుకోవాలన్నారు. ప్రయాణికులు అలర్ట్ గా ఉండాలని సూచించారు.
Read Also: జమ్మూ నుంచి శ్రీనగర్ కు డైరెక్ట్ ట్రైన్.. దశాబ్దాల కల సాకారం!