ప్రయాణీకులకు భారతీయ రైల్వే సంస్థ బోలెడు సౌకర్యాలను కల్పిస్తుంది. రైలు టికెట్ కొనుగోలు చేసిన ప్రతి ప్రయాణీకుడికి బోలెడు ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, వీటి గురించి చాలా మందికి తెలియదు. ఇంతకీ టికెట్ కొనుగోలుచేసిన ప్రయాణీకులకు రైల్వే అందిస్తున్న సౌకర్యాలు ఏంటి? ఎప్పుడు అందిస్తుంది? అనే విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
మీరు ప్రయాణించేటప్పుడు బస చేయడానికి హోటల్, హోమ్ స్టే కోసం చూస్తున్నట్లయితే.. ధృవీకరించబడిన రైలు టికెట్తో IRCTC డార్మిటరీలో బస చేయడానికి భారతీయ రైల్వే మీకు అవకాశం కల్పిస్తుంది. అది కూడా చాలా తక్కువ ధరకే. కేవలం రూ. 150కే 24 గంటల పాటు బెడ్, ప్రైవేట్ వాష్ రూమ్ ను పొందవచ్చు. మీరు బడ్జెట్ లో ప్రయాణిస్తే, ఇది మీకు మంచి ఎంపిక అవుతుంది.
భారతీయ రైల్వే సంస్థ అన్ని AC1, AC2, AC3 కోచ్లలో తన ప్రయాణీకులకు ఒక దుప్పటి, ఒక దిండు, రెండు బెడ్ షీట్లు, ఒక హ్యాండ్ టవల్ను అందిస్తుంది. గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ లో ఈ సదుపాయాలకు రూ. 25 చెల్లించాలి. కొన్ని రైళ్లలో, ప్రయాణీకులు స్లీపర్ క్లాస్ లో బెడ్ రోల్లను కూడా పొందవచ్చు. ఒకవేళ మీకు బెడ్ రోల్ లభించకపోతే, రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసి, మీ అమౌంట్ ను రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది.
రాజధాని, దురంతో, శతాబ్ది లాంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణిస్తున్న సమయంలో రైలు 2 గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే, రైల్వే సంస్థ మీకు ఫ్రీగా ఫుడ్ అందిస్తుంది. ఇంకా రైలు ఆలస్యం అయితే ఇ-క్యాటరింగ్ సర్వీస్ ద్వారా రైలులో ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.
దేశంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో క్లోక్ రూమ్లు, లాకర్ రూమ్లు అందుబాటులో ఉన్నాయి. మీరు మీ వస్తువులను ఈ లాకర్ రూమ్లు, క్లోక్ రూమ్లలో గరిష్టంగా నెల రోజుల వరకు ఉంచుకోవచ్చు. అయితే, ఈ సదుపాయం పొందేందుకు కొంత ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
ఒక్కోసారి ఏదైనా స్టేషన్లో దిగిన తర్వాత, మీరు తదుపరి రైలును ఎక్కడానికి స్టేషన్లో కొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. లేదంటే, ఇతర పని కోసం స్టేషన్లో ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో స్టేషన్ లో నిర్మించిన ఏసీ, నాన్-ఏసీ వెయిటింగ్ హాల్లో హాయిగా వేచి ఉండవచ్చు. ఈ సౌకర్యాన్ని పొందేందుకు రైలు టికెట్ ఉంటే సరిపోతుంది.
రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మీకు అనారోగ్యంగా అనిపిస్తే, రైల్వే సంస్థ మీకు ఉచితంగా ప్రథమ చికిత్స అందిస్తుంది. ఒకవేళ ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉంటే, తదుపరి చికిత్స కోసం ఏర్పాట్లు చేస్తుంది. రైల్లో వైద్యసాయం కోసం టికెట్ కలెక్టర్లు, రైలు సూపరింటెండెంట్లు సహా ఇతర రైలు ఉద్యోగులకు విషయం చెప్పాలి. మీరు చేరుకునే తర్వాతి రైల్వే స్టేషన్ లో నామినల్ ఫీజుతో వైద్య చికిత్సను అందిస్తారు.
రైలు టికెట్ బుక్ చేసుకునే సమయంలో కేవలం 45 పైసలు ఖర్చు చేయడం ద్వారా భారతీయ రైల్వే మీకు రూ. 7 నుంచి 10 లక్షల బీమా అందిస్తుంది. ఈ బీమా ఏదైనా అవాంఛనీయ పరిస్థితిలో మీ కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తుంది.
Read Also: వందేభారత్ లో తాగి రచ్చ చేసిన జంట, RPF సిబ్బంది ఏం చేశారంటే?