Surprise Checks in Trains Across India: రైళ్లలో లిక్కర్, గుట్కాతో సహా నిషేధిత వస్తువుల అమ్మకాలను అరికట్టేందుకు భారతీయ రైల్వే స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. దేశ వ్యాప్తంగా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పలువురిని అరెస్ట్ చేశారు. ఇటీవల కొన్ని రైళ్లలో హౌస్ కీపింగ్, ప్యాంట్రీ కార్, క్యాటరింగ్ సిబ్బందితో పాటు మరికొంతమంది నిబంధనలకు విరుద్ధంగామద్యం, గుట్కా వంటి నిషేధిత వస్తువులను అమ్ముతున్నారని రైల్వే అధికారులకు తెలిసింది. ఈ విషయాన్ని రైల్వే బోర్డు సీరియస్ గా తీసుకుంది.
రైళ్లలో మద్యం, గుట్కాల అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని దేశ వ్యాప్తంగా అన్ని జోనల్ రైల్వేలకు రైల్వేబోర్డు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. రైళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సూచించింది. రన్నింగ్ రైళ్లలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న కార్యకలాపాలను అరికట్టేందుకు సీనియర్ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలన్నది. ఈ టీమ్స్ ప్యాంట్రీ కార్లు, లినెన్ మెయింటెనెన్స్ సిబ్బంది, క్యాటరింగ్ సిబ్బంది, ఇతర బోర్డు సిబ్బందిని తనిఖీ చేశారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, మెకానికల్ వింగ్, కమర్షియల్ వింగ్ కు చెందిన అధికారులు కలిసి ఈ తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో కొంతమంది ప్రయాణికుల దగ్గర మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. చట్టవిరుద్ధంగా మద్యం కలిగి ఉన్నందుకు పలువురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
నిజానికి రైళ్లలో మద్యం, గుట్కా, ఇతర నిషేధిత వస్తువులను అమ్మడం పూర్తిగా నిషేధం. ఒకవేళ అమ్మితే రైల్వే రూల్స్ ను ఉల్లంఘించినట్లు అవుతుంది. ఇలాంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడే వ్యక్తులు, ఏజెన్సీలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తాజాగా రైల్వే అధికారులు హెచ్చరించారు. అవసరమైతే వారిని విధుల నుంచి తొలగించడంతో పాటు ఆయా సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెడతామని తేల్చి చెప్పారు.
Read Also: పీక్ సీజన్లో కీలక నిర్ణయం, ఆ రైలుకు అడిషనల్ థర్డ్ ఏసీ కోచ్!
అటు ప్రయాణ సమయంలో రైల్వే సిబ్బంది ప్రవర్తన గురించి ప్రయాణికుల అభిప్రాయాన్ని కూడా అధికారులు తీసుకుంటున్నారు. రైళ్లలో మద్యం సేవించడం, పొగతాగడం ఇప్పటికే నిషేధించారు. అయినప్పటికీ కొన్ని సుదూర రైళ్లలో ఈ నియమాలు ఉల్లంఘిస్తున్నట్లు రైల్వేకు ఫిర్యాదులు వచ్చాయి. స్మోకింగ్ కారణంగా ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగడంతో పాటు అగ్ని ప్రమాదాలకు కూడా కారణమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రైళ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే ప్రాంతాల్లో పూర్తిగా స్మోకింగ్ ను నిషేధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే, రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 167 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు మరోసారి హెచ్చరించారు.
Read Also: సమ్మర్ ట్రావెలర్స్ కు గుడ్ న్యూస్.. 1,484 స్పెషల్ ట్రైన్స్ ప్రకటించిన రైల్వే!