Indian Railways Summer Special Trains 2026: వేసవి సెలవులు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచడానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 1,484 సమ్మర్ స్పెషల్ రైళ్లను నడపించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లలో 749 రిజర్వేషన్ రైళ్లు, 735 రిజర్వేషన్ రైళ్లు ఉంటాయని తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. సెలవుల కాలంలో టికెట్లు దొరకక ఇబ్బంది పడే ప్రయాణికులకు కొంత ఉపశమనం లభించనుంది.
వేసవిలో స్కూళ్లకు సెలవులు రావడం, చాలా మంది ఉద్యోగులు సైతం కుటుంబాలతో కలిసి పర్యాటక ప్రదేశాలకు వెళ్లడం వల్ల రైళ్లలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో చాలా మార్గాల్లో టికెట్లు త్వరగా ఫుల్ కావడం, వెయిటింగ్ లిస్ట్ లు ఎక్కువ కావడం కామన్ అవుతుంది. ఈ పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు రైల్వే శాఖ ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో భాగంగానే సమ్మర్ స్పెషల్ రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది.
సమ్మర్ స్పెషల్ రైళ్లు ముఖ్యంగా ముంబై–దౌండ్–సోలాపూర్, పూణే–కొల్హాపూర్, నాసిక్ రోడ్–బద్నేరా, హడప్సర్–వరంగల్ మార్గాల్లో నడుస్తాయి. అలాగే ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ముంబై–బల్లియా, ముంబై–గోరఖ్ పూర్, దౌండ్–కలబురగి, సోలాపూర్–కలబురగి, అనకాపల్లి లాంటి మార్గాల్లో కూడా ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడానికి రైల్వే నిర్ణయం సాయపడుతుందని రైల్వే అధికారులు తెలిపారు. పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని రైల్వే నెట్ వర్క్ లో కొన్ని సదుపాయాలను కూడా మెరుగుపరిచినట్లు వెల్లడించారు.
ఇక సమ్మర్ స్పెషల్ రైళ్లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, స్టేషన్లు, ఇతర వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ప్రయాణికుల టికెట్ సెర్చింగ్, వెయిటింగ్ లిస్ట్ లు, ప్రయాణ డిమాండ్ లాంటి వివరాలను అనలైజ్ చేయడానికి AI సాంకేతికతను కూడా రైల్వేలు వినియోగిస్తున్నాయి. అవసరమైతే ఎక్కువ డిమాండ్ ఉన్న మార్గాల్లో మరిన్ని రైళ్లను ప్రవేశపెట్టే అవకాశముందని అధికారులు తెలిపారు. సమ్మర్ పర్యటనలకు వెళ్లే ప్రయాణీకులు ఈ ప్రత్యేక రైళ్లను ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. సమ్మర్ రద్దీని తగ్గించడంతో పాటు ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఈ రైళ్లను తీసుకొస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
Read Also: రైలులో సీటు కోసం గొడవ.. ఈ ఆంటీకి ఆస్కార్ ఇవ్వాల్సిందే, చివరిలో మిస్ కావద్దు!
మరోవైపు, ఇటీవల రైల్వే బోర్డు వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ రైళ్లలో అత్యవసర కోటాను మళ్లీ అమల్లోకి తీసుకొచ్చింది. అత్యవసరంగా ప్రయాణించాల్సిన ప్రయాణికుల కోసం కొన్ని బెర్త్ లను ప్రత్యేకంగా కేటాయించే విధానాన్ని తిరిగి ప్రారంభించినట్లు వెల్లడించింది.
Read Also: ఈ రైల్వే స్టేషన్ ఏంటి బ్రో ఇంత బాగుంది.. స్వర్గంలో కాదు, మనకు దగ్గరలోనే ఉంది!