Railways Increases Capacity on Jammu–Delhi Rajdhani: జమ్మూ కాశ్మీర్ కు ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఆహ్లాదకర ప్రయాణం, వెయిటింగ్ లిస్ట్ సమస్యను తగ్గించేందుకు నార్త్ రైల్వేలోని జమ్మూ డివిజన్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జమ్మూ–న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ రైల్లో అదనంగా థర్డ్ ఏసీ (3AC) కోచ్ ను యాడ్ చేయాలని నిర్ణయించింది. పీక్ ట్రావెల్ సీజన్ లో ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
మొదటిగా ఈ అదనపు కోచ్ను మార్చి 7న (రైలు నంబర్ 12426కు) యాడ్ చేసింది భారతీయ రైల్వే. ఈ కోచ్ ను మార్చి 14న కొనసాగే ప్రయాణానికి మాత్రమే అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. అయితే, ప్రయాణికుల నుంచి వస్తున్న భారీ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు మరికొన్ని ట్రిప్పులకు పొడిగించాలని నిర్ణయించారు. తాజా నిర్ణయం ప్రకారం మార్చి 13, 15 తేదీల్లో కూడా ఈ అదనపు 3AC కోచ్ అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఈ అడిషనల్ కోచ్ ను యాడ్ చేయడం ద్వారా రైలులో ప్రయాణించే వారి సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. సాధారణంగా ఒక 3AC కోచ్లో సుమారు 72 బెర్త్ లు ఉంటాయి. అందువల్ల ప్రతి ప్రయాణంలో అదనంగా 70 మందికి పైగా ప్రయాణికులు సౌకర్యంగా ప్రయాణించే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ప్రయాణికులకు మేలు కలగనుంది. రాజధాని ఎక్స్ ప్రెస్ లాంటి ప్రీమియం రైళ్లలో అదనపు కోచ్ లను యాడ్ చేయడం వల్ల ప్రయాణ సామర్థ్యం పెరగడమే కాకుండా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఆధునిక భద్రతా ప్రమాణాలు, మెరుగైన సదుపాయాలు కారణంగా ప్రయాణ అనుభవం మెరుగుపడుతుందని అధికారులు వెల్లడించారు.
Read Also: ఈ రైల్వే స్టేషన్ ఏంటి బ్రో ఇంత బాగుంది.. స్వర్గంలో కాదు, మనకు దగ్గరలోనే ఉంది!
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జమ్మూ రైల్వే డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఉచిత్ సింఘాల్ వెల్లడించారు. ప్రయాణికులు అదనపు సీట్ల లభ్యతకు సంబంధించి IRCTC అధికారిక వెబ్ సైట్ లేదంటే, రైల్వే టోల్ ఫ్రీ నంబర్ 139కు కాల్ చేసి తెలుసుకోవాలని సూచించారు. పీక్ ట్రావెల్ సీజన్లో అధిక డిమాండ్ ఉన్న ఈ మార్గంలో ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందన్నారు. ప్రయాణీకులు రైల్వే కల్పిస్తున్న ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని సింఘాల్ సూచించారు.
Read Also: సమ్మర్ ట్రావెలర్స్ కు గుడ్ న్యూస్.. 1,484 స్పెషల్ ట్రైన్స్ ప్రకటించిన రైల్వే!