Indian Railway: రైళ్లలో నిర్ణీత ధరలకు మించి ఆహార పదార్థాలు అమ్మకూడదంటూ రైల్వేశాఖ ఎంత సీరియస్ గా చెప్పినా, క్యాటరింగ్ సిబ్బంది పట్టించుకోవడం లేదు. మీరు ఎన్నైనా చెప్పండి, మేం చేయాల్సింది చేస్తామన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా వాటర్ బాటిళ్లను ఎక్కువ ధరకు అమ్ముతున్నారంటూ ఓ ప్రయాణీకుడు ఫిర్యాదు చేశాడు. రెచ్చిపోయిన క్యాటరింగ్ సిబ్బంది సదరు ప్రయాణీకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. బట్టలు చింపేసి, చితకబాదారు. హేమకుంట్ ఎక్స్ ప్రెస్ లో జరిగిన ఈ ఘటనపై రైల్వేశాఖ సీరియస్ అయ్యింది. కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో పాటు జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
విశాల్ శర్మ అనే యువకుడు హేమకుంట్ ఎక్స్ ప్రెస్ (రైలు నెంబర్ 14609) లో రిషికేశ్ నుంచి, జమ్మూ శ్రీవైష్ణోదేవి కత్రా వరకు ప్రయాణం చేస్తున్నాడు. మార్గం మధ్యలో తను వాటర్ బాటిల్ కొనుగోలు చేశాడు. ఎమ్మార్పీ రూ. 15 ఉండగా, క్యాటరింగ్ సిబ్బంది రూ. 20 వసూలు చేశారు. ఎక్కువ ఎందుకు? అని ప్రశ్నిస్తే సిబ్బంది సరైన సమాధానం చెప్పలేదు. అధిక ధరల వసూళ్లపై విశాల్ శర్మ.. రైల్వే అధికారులకు ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు తర్వాత అసలు కథ షురూ!
విశాల్ శర్మ ఫిర్యాదు స్వీకరించిన రైల్వే అధికారులు సదరు క్యాటరింగ్ సిబ్బందికి కాల్ చేసి, సీరియస్ అయ్యారు. వెంటనే అతడి దగ్గర వసూళు చేసిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని ఆదేశించారు. దీంతో రెచ్చిపోయిన క్యాటరింగ్ సిబ్బంది నేరుగా థర్డ్ ఏసీలో ప్రయాణిస్తున్న విశాల్ దగ్గరికి వచ్చి ఎలా ఫిర్యాదు చేస్తావంటూ నిలదీశారు. అంతేకాదు, బెర్త్ లో పడుకున్న తనను కిందికి లాగి చితకబాదారు. ఈ ఘటనలో విశాల్ చేతులు, ముఖం మీద తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇండియన్ రైల్వేతో పాటు రైల్వేమంత్రి, ఐఆర్సీటీసీకి ట్యాగ్ చేశాడు. ఎక్కువ ధరలు వసూళు చేయడమే కాదు, ఇదేంటని ఫిర్యాదు చేసిన తనపై హత్యాయత్నం చేశారంటూ ఈ వీడియోలో వెల్లడించాడు.
This is The Passenger Security in 3rd AC of Indian Railway #shame || When I complained about overcharging in Train by Pantry , an attempt was made to kill me 😭😭
Train no.14609
PNR – 2434633402@RailMinIndia @IRCTCofficial @narendramodi @RailwayNorthern @AshwiniVaishnaw pic.twitter.com/VSNZlblHOQ— Mr.Vishal (@Mrvishalsharma_) May 7, 2025
Read Also: రాజధాని ఎక్స్ ప్రెస్ లో పాము కలకలం.. నెట్టింట వీడియో వైరల్!
రైల్వేశాఖ సీరియస్.. రూ. 5 లక్షల జరిమానా, కేసు నమోదు
అటు ఈ ఘటనపై రైల్వే అధికారులు సీరియస్ అయ్యారు. వెంటనే కేసు నమోదు చేయలని రైల్వే పోలీసులను ఆదేశించారు. “ఈ కేసును అత్యంత తీవ్రమైనదిగా పరిగణిస్తున్నారు. క్యాటరర్ కు రూ. 5 లక్షలు జరిమానా విధిస్తున్నాం. ఈ ఘటనకు సంబంధించి కథువా రైల్వే గవర్నమెంట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం. దర్యాప్తు తర్వాత కఠిన చర్యలు తీసుకుంటాం” అని రైల్వే సేవ పోర్టల్ ద్వారా అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్యాటరింగ్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: రాజధాని ఎక్స్ ప్రెస్ లో పాము కలకలం.. నెట్టింట వీడియో వైరల్!