Vande Bharat Train Coaches Reduce: అత్యాధునిక సౌకర్యాలు, అత్యంత వేగవంతమైన ప్రయాణం అందించే వందేభారత్ రైళ్లకు ప్రయాణీకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 5 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. అయితే, డిమాండ్ ఎక్కువగా ఉన్న రూట్లలో వందేభారత్ కోచ్ ల సంఖ్య పెంచి, ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్న రూట్లలో కోచ్ ల సంఖ్య తగ్గిస్తున్నారు రైల్వే అధికారులు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పటికే ఓ రైలు కోచ్ లు తగ్గించగా, ఇప్పుడు మరో రైలు కోచ్ లు తగ్గించబోతున్నారు. ఇంతకీ ఆ రైలు ఏ రూట్ లో నడుస్తుందంటే..
20 కోచ్ ల నుంచి 8 కోచ్ లకు కుదింపు
నాగపూర్- సికింద్రాబాద్ మధ్య రాకపోకలు కొనసాగించే వందేభారత్ రైలు కోచ్ లు గణనీయంగా తగ్గిస్తున్నారు. ఫిబ్రవరి 19 నుంచి కోచ్ ల తగ్గింపు అమల్లోకి రానుంది.దేశంలో మొట్టమొదటి 20 కోచ్ల వందే భారత్ రైలు అయిన నాగ్పూర్-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ను ఏకంగా 8 కోచ్లకు తగ్గించనున్నారు. ఈ మేరకు ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ (PCOM) కోచింగ్ నోటిఫికేషన్ జారీ చేశారు. తక్కువ ఆక్యుపెన్సీ రేట్ కారణంగా రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేవలం 25% ఆక్యుపెన్సీ ఉండటంతో కీలక నిర్ణయం
గత సెప్టెంబర్ లో ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును అట్టహాసంగా ప్రారంభించారు. అయితే, తొలి నుంచి ప్రయాణీకులను ఆకర్షించడంలో ఇబ్బంది పడింది. ఈ రూట్ లో ఆక్యుపెన్సీ రేట్ కేవలం 25% ఉంది. నాగ్పూర్ నుంచి తెల్లవారుజామున 5 గంటలకు బయల్దేరి, మధ్యాహ్నం సమయంలో సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. అయితే, ఈ టైమ్ ప్రజలకు పెద్దగా అనుకూలంగా లేదు. అదే సమయంలో ఇతర మెయిల్/ఎక్స్ ప్రెస్ రైళ్లతో పోలిస్తే ప్రీమియం ఛార్జీ.. ప్రయాణ సమయంలో స్వల్ప తగ్గింపును ఉండటంతో ప్రయాణీకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చూసుకుంటున్నారు. సాధారణ ఎక్స్ ప్రెస్ రైళ్లు సుమారు 8 గంటలు ప్రయాణిస్తే, వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు 7 గంటల 15 నిమిషాల్లో చేరుకుంటుంది.
ప్రయత్యామ్నాయ రైలును ఎంచుకుంటున్న ప్రయాణీకులు
ప్రయాణీకులు ఎక్కువ సౌలభ్యం కోసం రాత్రిపూట ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వందేభారత్ రైలు ప్రయాణం చేయాలనుకునే వాళ్లు నాగపూర్- బిలాస్ పూర్ వందే భారత్ ను ఎంచుకుంటున్నారు. ఈ రైలు కోచ్ లు కూడా త్వరలో తగ్గనున్నాయి. ఈ రైలు ప్రారంభంలో 16-కోచ్ లతో ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఆ తర్వాత తక్కువ డిమాండ్ కారణం గా త్వరలో 8 కోచ్లకు తగ్గించబడింది.
విశాఖ-దుర్గ్ వందేభారత్ కోచ్ లు సగానికి తగ్గింపు
రీసెంట్ గా విశాఖపట్నం-దుర్గ్ రైలు కోచ్ లు సగానికి సగం తగ్గించారు. ఈ రూట్ లో పెద్దగా ప్రయాణీకుల నుంచి డిమాండ్ లేకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 16న విశాఖ-దుర్గ్((20829/20830) రైలును అధికారులు ప్రారంభించారు. 16 కోచ్ లతో ఈ రైలు అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ రూట్ లో అనుకున్న స్థాయిలో ప్రయాణీకుల నుంచి ఆదరణ లభించడం లేదు. కేవలం 40 నుంచి 45 శాతం ఆక్యుపెన్సీ ఉంటుంది. అటు దుర్గ్ నుంచి విశాఖ వచ్చే సమయంలో రాయగఢ వరకు 50 శాతం ఆక్యుపెన్సీ ఉంటుండగా, ఆ తర్వాత విశాఖ వరకు కేవలం 20 నుంచి 25 శాతం ఆక్యుపెన్సీ ఉంటున్నది. కోచ్ లన్నీ ఖాళీగానే దర్శనం ఇచ్చాయి.