Indian Railway: దేశంలోని రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే తీపి కబురు అందించింది. రైళ్లలో ప్రయాణికుల రద్దీని తగ్గించి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఏకంగా 17,000 కొత్త జనరల్, స్లీపర్ కోచ్లను తయారు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
దేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు జనరల్, స్లీపర్ క్లాస్లపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. పెరిగిన జనాభా, ప్రయాణ అవసరాలకు అనుగుణంగా సీట్ల లభ్యతను పెంచడం ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశమని లోక్ సభ వేదికగా రైల్వే మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం భారతీయ రైల్వే వద్ద ఉన్న మొత్తం 89,000 కోచ్లలో దాదాపు 62,000 నాన్-ఏసీ కోచ్లే ఉన్నాయి. అంటే మొత్తం కోచ్ లలో ఇవి 70 శాతానికి సమానమని రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. కాబట్టి మరిన్ని అదనపు జనరల్ కోచ్ లు తీసుకురావడం వల్ల సామాన్య కుటుంబాలకు ప్రయాణం మరింత సులభతరం అవుతుందని రైల్వే మంత్రి పేర్కొన్నారు.
గడిచిన కొన్ని ఏళ్లలో పెరిగిన కోచ్ల వివరాలను సైతం రైల్వేమంత్రి.. లోక్ సభలో పంచుకున్నారు. ఆ డేటా ప్రకారం.. 2024-25లో దూరప్రాంత రైళ్లలో దాదాపు 1,250 జనరల్ కోచ్లను అందుబాటులోకి తెచ్చారు. 2025-26 ఏడాదికి గాను 160 జనరల్ కోచ్లతో కలిపి మొత్తం 870 కోచ్లను రైళ్లకు అదనంగా జోడించారు. 2026-27 జూన్ 30 నాటికి 20 జనరల్ కోచ్లతో సహా సుమారు 190 కోచ్లను పెంచారు.
సామాన్యులకు తక్కువ ధరకే మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ‘అమృత్ భారత్ ఎక్స్ప్రెస్’ రైళ్లను కూడా వేగంగా విస్తరిస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 36 జతల అమృత్ భారత్ రైళ్లు నడుస్తున్నట్లు ఆయన లోక్ సభకు తెలిపారు. ఇవి పూర్తిగా నాన్-ఏసీ రైళ్లు అయినప్పటికీ అందులో 11 జనరల్, 8 స్లీపర్ కోచ్లు ఉంటాయి. వీటిలో సీసీటీవీ కెమెరాలు, యూఎస్బీ టైప్-ఎ, టైప్-సి ఛార్జింగ్ పాయింట్లు, అధునాతన టాయిలెట్స్, ఎమర్జెన్సీ టాక్-బ్యాక్ సిస్టమ్, మెరుగైన అగ్నిమాపక భద్రతా సౌకర్యాలు ఉన్నాయని పార్లమెంటుకు తెలియజేశారు.
Also Read: హోటల్ గదుల్లో గడియారాలు ఎందుకు ఉండవో తెలుసా? దీని వెనుక మిస్టరీ ఇదే!
ఇదిలా ఉంటే కొత్తగా తీసుకురాబోయే 17,000 కొత్త కోచ్లను ఏయే రూట్లలో ప్రవేశపెడతారు? తయారీ పూర్తికావడానికి ఎంత సమయం పడుతుంది? అనే దానిపై రైల్వే శాఖ నిర్దిష్ట సమయాన్ని వెల్లడించలేదు. తయారీ పూర్తయిన కొద్దీ దశలవారీగా వేర్వేరు మార్గాల్లోని రైళ్లకు ఈ కోచ్లను జోడించనున్నట్లు మాత్రమే స్పష్టం చేసింది. మెుత్తం మీద రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం అమల్లోకి వస్తే జనరల్, స్లీపర్ క్లాస్లలో ప్రయాణించే కోట్లాది మంది సామాన్య ప్రయాణికులకు రద్దీ సమస్య నుండి పెద్ద ఉపశమనం లభించనుంది.
Also Read: మళ్లీ తెరపైకి షేక్ హ్యాండ్ వివాదం…మా కాళ్ల దగ్గరకు బీసీసీఐ వచ్చిందంటూ ఓవరాక్షన్