Indian Railways Online Luggage Booking: రైలులో ఎక్కువ సామానుతో ప్రయాణించే ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై అదనపు సామాను బుక్ చేయడానికి ప్రత్యేకంగా రైల్వే స్టేషన్ లోని పార్సెల్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపట్టింది. జూలై 31 నుంచి ఆన్ లైన్ లో అదనపు లగేజీని కూడా బుక్ చేసుకునే కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాబోతోంది.
ఇప్పటి వరకు నిర్ణీత ఉచిత పరిమితికి మించి సామాను తీసుకెళ్లాలంటే ప్రయాణికులు పార్సెల్ కార్యాలయానికి వెళ్లి బుకింగ్ చేయాల్సి వచ్చేది. కొత్త విధానంతో ఈ ప్రక్రియ మరింత సులభం కానుంది. టికెట్ రిజర్వేషన్ చేసే సమయంలోనే అదనపు లగేజీ వివరాలను నమోదు చేసి, అవసరమైన ఛార్జీని చెల్లించే అవకాశం ఉంటుంది. అయితే ఈ సదుపాయం అన్ని కోచ్లకు వర్తించదు. ఏసీ 3 టైర్, ఏసీ చైర్ కార్, సెకండ్ క్లాస్ కోచ్లలో ప్రస్తుతం ఉన్న ఉచిత సామాను పరిమితుల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ తరగతుల్లో ఉచిత పరిమితి, గరిష్ట అనుమతి ఒకేలా ఉండటంతో అదనపు సామాను బుక్ చేసుకునే అవకాశం ఉండదు.
ప్రస్తుతం రైల్వే నిబంధనల ప్రకారం ఏసీ ఫస్ట్ క్లాస్లో 70 కిలోలు, ఫస్ట్ క్లాస్/ఏసీ 2 టైర్లో 50 కిలోలు, ఏసీ 3 టైర్, ఏసీ చైర్ కార్, స్లీపర్ క్లాస్లో 40 కిలోలు, సెకండ్ క్లాస్ లో 35 కిలోల వరకు ఉచితంగా సామాను తీసుకెళ్లవచ్చు. ఉచిత పరిమితిని మించి సామాను తీసుకెళ్లాలనుకునే వారు, ఆయా తరగతులకు అనుమతించిన గరిష్ట పరిమితిలోపు మాత్రమే అదనపు బుకింగ్ చేసుకోవాలి. ఇందుకోసం సాధారణ లగేజీ ఛార్జీకి 1.5 రెట్లు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా ఏసీ ఫస్ట్ క్లాస్లో 150 కిలోలు, ఫస్ట్ క్లాస్/ఏసీ 2 టైర్ లో 100 కిలోలు, స్లీపర్ క్లాస్ లో 80 కిలోలు, సెకండ్ క్లాస్ లో 70 కిలోల వరకు సామాను తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అయితే ఏసీ 3 టైర్, ఏసీ చైర్ కార్ కోచ్ లలో అదనపు లగేజీ బుకింగ్కు అవకాశం ఉండదని అధికారులు వెల్లడించారు.
ప్రయాణ సమయంలో, గమ్యస్థానంలో అనుమతించిన పరిమితికి మించి బుక్ చేయని సామాను ఉన్నట్లు గుర్తిస్తే జరిమానా విధించే అవకాశం ఉందని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎక్కువ సామాను తీసుకెళ్లే వారు ముందుగానే నిబంధనలు తెలుసుకుని బుక్ చేసుకోవడం మంచిది. సామాను బరువుతో పాటు దాని పరిమాణంపై కూడా రైల్వే పరిమితులు విధించాయి. ఏసీ 3 టైర్, ఏసీ చైర్ కార్ కోచ్లలో నిర్ణయించిన కొలతల కంటే పెద్ద సామానును అనుమతించరు. అలాంటి వస్తువులను తప్పనిసరిగా లగేజీ, పార్సెల్ వ్యాన్ లో బుక్ చేయాలి. లగేజీ ఛార్జీలు ప్రయాణ దూరం, బరువు, రైలు రకం ఆధారంగా మారుతాయి. కనీసంగా 10 కిలోల స్లాబ్కు రూ.30 నుంచి ఛార్జీలు ప్రారంభమవుతాయి. కనీస బుకింగ్ దూరం 50 కిలోమీటర్లుగా ఉంటుంది.
Read Also: విశాఖ–బెంగళూరు వందే భారత్ స్లీపర్.. విజయవాడ మీదుగానేనా?