New Railway Reservation System: భారతీయ రైల్వే 40 ఏళ్ల నాటి టికెట్ రిజర్వేషన్ వ్యవస్థను పూర్తిగా మారబోతోంది. ఈ ఏడాది ఆగస్టు నుంచి కొత్త ప్లాట్ ఫారమ్కు మార్చేందుకు రెడీ అవుతోంది. రైల్వే శాఖ తీసుకొస్తున్న ఈ వ్యవస్థతో టికెట్ బుకింగ్ సేవలు మరింత వేగంగా, సులభంగా మారనున్నట్లు రైల్వే ప్రకటించింది. ఈ రిజర్వేషన్ వ్యవస్థను మార్చే సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులను ఆదేశించారు. దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న పాత వ్యవస్థ స్థానంలో ఆధునిక సాంకేతికతతో రూపొందించిన కొత్త వ్యవస్థను తీసుకురావడం ద్వారా టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత సమర్థవంతంగా మార్చాలని రైల్వే శాఖ భావిస్తోంది.
భారతీయ రైల్వే ప్రయాణీకుల రిజర్వేషన్ వ్యవస్థ మొదటగా 1986లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రయాణికుల సంఖ్య పెరగడం, ఆన్ లైన్ సేవల వినియోగం పెరగడంతో ఈ వ్యవస్థలో పలు మార్పులు చేశారు. ముఖ్యంగా 2002లో ఆన్ లైన్ టికెట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి రావడం రైల్వే సేవల్లో విప్లవం ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బుక్ అయ్యే రైలు టికెట్లలో దాదాపు 88 శాతం టికెట్లు ఆన్ లైన్ ద్వారానే బుక్ అవుతున్నాయి.
ఇటీవలి కాలంలో రైల్వే శాఖ ప్రవేశపెట్టిన ‘రైల్వన్’ సూపర్ యాప్ ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు అందిస్తోంది. 2025లో ప్రారంభించిన ఈ యాప్ లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? లేదా? అన్నదానిపై ఈ యాప్ ముందుగానే అంచనా వేస్తోంది. ఈ అంచనాల కచ్చితత్వం గతంలో 53 శాతం ఉండగా ఇప్పుడు 94 శాతానికి పెరిగిందని అధికారులు వెల్లడించారు. ‘రైల్వన్’ యాప్ ద్వారా రిజర్వ్డ్ టికెట్లు, అన్రిజర్వ్డ్ టికెట్లు, ప్లాట్ ఫారమ్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే టికెట్ రద్దు, రీఫండ్ లాంటి సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికులు తమ టికెట్ వెయిటింగ్ స్టేటస్, రైలు సమయాలు, లైవ్ రన్నింగ్ స్టేటస్, ప్లాట్ ఫారమ్ వివరాలు, కోచ్ పొజిషన్ లాంటి సమాచారం కూడా ఈ యాప్ లో పొందవచ్చు. రైల్ మదద్ ద్వారా ప్రయాణికుల ఫిర్యాదులు, సాయం వంటి సేవలు కూడా అందిస్తున్నారు.
రైల్ వన్ యాప్ ద్వారా రోజూ సుమారు 9.29 లక్షల టికెట్లు బుక్ అవుతున్నాయి. ఇందులో 7.2 లక్షల అన్ రిజర్వ్డ్ టికెట్లు, 2.09 లక్షల రిజర్వ్డ్ టికెట్లు ఉన్నాయి. ఈ యాప్ కు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కొత్త రిజర్వేషన్ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత టికెట్ బుకింగ్ మరింత వేగంగా, కచ్చితంగా జరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read Also: బెంగళూరు-హైదరాబాద్ బుల్లెట్ రైల్ రూట్ ఫిక్స్, స్టేషన్లు ఎక్కడెక్కడ ఉంటాయంటే?