Indian Railway: ప్రయాణీకులకు నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలు కల్పించాలని భారతీయ రైల్వే సూచించింది. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించింది. రీసెంట్ గా దురంతో ఎక్స్ ప్రెస్ లో మార్నింగ్ టీ ఇవ్వని క్యాటరర్ కు జరిమానా విధించింది. ప్రయాణీకుడి ఫిర్యాదుతో రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇలాంటి ఘటనలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
చెన్నై–హజ్రత్ నిజాముద్దీన్ దురంతో ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు తనకు మార్నింగ్ టీ ఇవ్వలేదని ఫిర్యాదు చేశాడు. దురంతో రైళ్లు ప్రీమియం, హై స్పీడ్ రైళ్లుగా ఉంటాయి. అందువల్ల ప్రయాణికులు బ్రేక్ ఫాస్ట్ కోసం రైలులోని క్యాటరింగ్ పై ఎక్కువగా ఆధారపడతారు. ఈ రైళ్ల టిక్కెట్ ఛార్జీలో క్యాటరింగ్ కూడా చేర్చబడి ఉంటుంది. అందుకే, టీవీ, బ్రేక్ ఫాస్ట్ అందించపోతే సర్వీస్ లోపంగా పరిగణించబడుతుంది.
అటు ప్రయాణీకుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన IRCTC.. అంతర్గత విచారణ జరిపింది. చివరకు సదరు ప్రయాణీకుడికి టీ ఇవ్వకపోవడం నిజమేనని గుర్తించింది. మెనూ ప్రకారం క్యాటరర్ సర్వీస్ అందించడంలో విఫలమయ్యాడని కనుగొంది. ఫలితంగా, సదరు కాంట్రాక్టర్ కు రూ. 5,000 జరిమానా విధించింది. సమాచార హక్కు చట్టంకింద ఫిర్యాదుదారుడైన పాలక్కాడ్కు చెందిన ఉన్నికృష్ణన్ ఆర్.కె. దరఖాస్తుకు IRCTC ఈ వివరణ ఇచ్చింది.
క్యాటరింగ్ ఏజెన్సీలు కాంట్రాక్ట్ ప్రకారం మెనూలో ఉన్న అన్ని వస్తువులను అందించాలని IRCTC అభిప్రాయపడింది. ఏ చిన్న లోపం ఉన్నా, సర్వీస్ లోపంగా పరిగణించబడుతుందని వెల్లడించింది. దురంతో రైళ్లలో క్యాటరింగ్ నిబంధనల పాటింపు చాలా ముఖ్యమైది. ఎందుకంటే, ఈ రైళ్లు పరిమిత స్టాప్ లతో ప్రీమియం, వేగవంతమైన సేవలు అందిస్తాయి. ప్రయాణికులు రైలులోనే బ్రేక్ ఫాస్ట్ చేసే అవకాశం ఉంది. క్యాటరింగ్ సరిగా లేకపోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
ఇటువంటి ఫిర్యాదులు గతంలో కూడా వచ్చాయి. 2023లో ఓ ప్రయాణికుడు రైల్లో ఫుడ్ ధరల్లో తేడాలను గుర్తించాడు. క్యాటరింగ్ విధానంపై ఆందోళన వ్యక్తం చేశాడు ఈ ఫిర్యాదులు రైల్వే సర్వీసులలో లోపాలను గుర్తించడంతో పాటు మొత్తం ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడంలో సాయపడుతాయి. ఇంకా చెప్పాలంటే ప్రీమియం రైళ్లలో క్యాటరింగ్ సేవల్లో లోపాలపై ప్రత్యేక నిఘా ఉంటుంది. IRCTC ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుని, క్యాటరర్లను అలర్ట్ చేస్తుంది. మార్నింగ్ టీ అందించడంలో విఫలమైన క్యాటరర్పై జరిమానా విధించడం, రైలు ప్రయాణంలో నాణ్యతా ప్రమాణాలను కాపాడేందుకు కీలక చర్యగా అధికారులు అభివర్ణిస్తున్నారు. ఇది ప్రయాణికులకు మెరుగైన అనుభవం, రైల్వే సేవల నమ్మకాన్ని పెంచుతుందంటున్నారు.
Read Also: రైళ్లపై రాళ్లు.. సరదా తీరిపోయే వరకు జైలు శిక్ష, వామ్మో.. అన్నేళ్లా?