Ayodhya, Varanasi and Prayagraj Tour: అయోధ్యలోని శ్రీరామ మందిరం, కాశీలోని కాశీ విశ్వనాథ ఆలయం, ప్రయాగరాజ్ త్రివేణి సంగమం లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాలను ఒకే యాత్రలో దర్శించాలనుకునే భక్తులకు IRCTC ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది. భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా 9 రోజుల ప్రత్యేక ‘కాశీ తీర్థ యాత్ర’ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ యాత్ర సెప్టెంబర్ 9, 2026న ప్రారంభం కానుంది. మొత్తం 8 రాత్రులు, 9 రోజుల పాటు సాగే ఈ టూర్ లో దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించే అవకాశం భక్తులకు లభించనుంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను ఒకే ప్యాకేజీలో కవర్ చేయడం ఈ యాత్ర ప్రత్యేకత. ఈ పర్యటనలో గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్ నగరాలను సందర్శించనున్నారు. గయలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన బోధగయతో పాటు విష్ణుపాద ఆలయాన్ని దర్శించవచ్చు. బౌద్ధ మతానికి అత్యంత పవిత్రమైన ప్రాంతంగా బోధగయకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
అటు వారణాసిలో భక్తులు కాశీ విశ్వనాథ ఆలయం, విశాలాక్షి అమ్మవారి ఆలయం, అన్నపూర్ణ దేవాలయం, కాలభైరవ ఆలయాలను సందర్శించే అవకాశం ఉంటుంది. అలాగే గంగా నది తీరంలో జరిగే అద్భుతమైన గంగా హారతిని కూడా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ప్రతి రోజు వేలాది మంది భక్తులను ఆకట్టుకునే ఈ హారతి వారణాసి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మరోవైపు అయోధ్యలో వైభవోపేతమైన శ్రీరామ జన్మభూమి మందిరాన్ని సందర్శించనున్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు దర్శించాలనుకునే ఈ ఆలయం ప్రస్తుతం ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారింది. ప్రయాగరాజ్ లో గంగా, యమునా, సరస్వతి నదుల సంగమంగా భావించే త్రివేణి సంగమాన్ని సందర్శించే అవకాశం కల్పించనున్నారు. హిందూ సంప్రదాయంలో ఈ ప్రాంతానికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది.
ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని IRCTC మూడు రకాల ప్యాకేజీలను అందిస్తోంది. ఎకానమీ కేటగిరీలో స్లీపర్ క్లాస్ ప్రయాణానికి ఒక్కొక్కరికి రూ.16,900గా ధర నిర్ణయించారు. 3ఏసీ కంఫర్ట్ కేటగిరీకి రూ.31,000, 2ఏసీ సుపీరియర్ కేటగిరీకి రూ.43,500 చెల్లించాల్సి ఉంటుంది. భారత్ గౌరవ్ ట్రైన్ పథకం కింద ఈ యాత్రపై ఇండియన్ రైల్వేస్ సుమారు 33 శాతం వరకు రాయితీ అందిస్తోంది. దీంతో భక్తులు తక్కువ ఖర్చుతో ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం పొందుతున్నారు.
ఈ ప్రత్యేక రైలు తమిళనాడులోని తిరునెల్వేలి నుంచి బయలుదేరుతుంది. మార్గమధ్యంలో విరుదునగర్, మదురై, దిండిగల్, తిరుచ్చిరాపల్లి, విల్లుపురం, చెంగల్పట్టు, తాంబరం, చెన్నై ఎగ్మోర్, గూడూరు, విజయవాడ లాంటి ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికులు తమకు అనుకూలమైన స్టేషన్లో రైలును ఎక్కవచ్చు. ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణం మాత్రమే కాకుండా హోటల్ వసతి, రోజుకు రెండు పూటల భోజనం, స్థానిక దర్శనాల ఏర్పాట్లు, అలాగే ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది.
Read Also: దేశ వ్యాప్తంగా మరో 7 కొత్త బుల్లెట్ రైల్ రూట్లు, కేంద్రం గ్రీన్ సిగ్నల్!