Kesamudram Railway Station Viral Video: రైల్వే స్టేషన్లు, రైళ్లలో ప్రయాణీకులు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని రైల్వే అధికారులు చెప్తున్నప్పటికీ, తీరు మార్చుకోవడం లేదు. రైల్వే ట్రాక్స్ మీది నుంచి వెళ్లకూడదు.. ఒకవేళ ప్లాట్ ఫారమ్ మారాలంటే, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఉపయోగించాలని చెప్పినా పట్టించుకోవడం లేదు. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా ఆపి ఉన్న గూడ్స్ రైలు కింది నుంచి ట్రాక్ దాటేందుకు ప్రయత్నించాడు. అకస్మాత్తుగా రైలు కదలడంతో షాకయ్యాడు. ఒక్కసారిగా రైలు కింద అలాగే పడుకోడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్ లో.. ఆగి ఉన్న గూడ్స్ రైలు కింద నుంచి ఓ వ్యక్తి పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. వంగి దాని కిందికి వెళ్లాడు. అప్పుడే ఊహించని సంఘటన జరిగింది. అతడు రైలు కిందికి వెళ్లగానే అకస్మాత్తుగా రైలు కదిలింది. భయంతో వణికిపోయిన సదరు వ్యక్తి.. సమయస్ఫూర్తిగా వ్యవహరించాడు. పట్టాల మీద అలాగే పడుకున్నాడు. కొద్ది సేపటికి రైలు వెళ్లిపోవడంతో ప్రాణాలుదక్కించుకున్నాడు.
కేసముద్రం స్టేషన్ నుంచి అమీనాపురం వైపునకు వెళ్లాల్సి ఉన్న గూడ్స్ రైలు.. ప్యాసింజర్ రైలుకు దారి ఇచ్చేందుకు కేసముద్రం రైల్వే స్టేషన్ లో ఆగింది. అదే సమయంలో ఓ వ్యక్తి పట్టాలు దాటాలనుకున్నాడు. ఆగి ఉన్న గూడ్స్ రైలు కింది నుంచి వెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం నుంచి ఆ వ్యక్తి బయటపడటంతో స్టేషన్ సిబ్బంది, అక్కడ ఉన్న ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. లేచిన టైమ్ బాగుంది కాబట్టే, ఆయన ప్రాణాలతో బయటపడ్డాడని పలువురు కామెంట్ చేశాడు.
Read Also: రూపాయికే విమాన ప్రయాణం, ఇండిగో అదిరిపోయే ఆఫర్!
అటు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రాక్ దాటే వ్యక్తిపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. రెండు నిమిషాలు ఆలస్యం అవుతుందని భావించిన నీకు, ప్రాణం విలువ తెలియదగా అంటూ మండిపడుతున్నారు. అతడు చేసిన పొరపాటు కారణంగా ఎంతో మంది ఇబ్బంది పడే అవకాశం ఉండేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: రాత్రి వేళ రైళ్లో ఈ పనులు అస్సలు చేయకండి, అతిక్రమించారో అంతే సంగతులు!