LPG Crisis Impacts Indian Railways Catering: ఇరాన్ యుద్ధం కారణంగా పెట్రో ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ నుంచి భారత్ కు రావాల్సిన క్రూడ్ ఆయిల్, LPG, CNG గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా భారత్ లో LPG సిలిండర్ల కొరత పెరిగిపోయింది. ఈ ప్రభావం ఇప్పుడు రైల్వే మీద కూడా పడే అవకాశం కనిపిస్తోంది. రైళ్లలో అందించే భోజన సేవలపైనా పడనున్నట్లు కనిపిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నిర్వహించే కొన్ని క్యాటరింగ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉన్నట్లు రైల్వే వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఒకవేళ అలా జరిగితే రిజర్వేషన్ సమయంలో ముందుగానే భోజనం బుక్ చేసుకున్న ప్రయాణికులకు చెల్లించిన డబ్బును తిరిగి ఇవ్వాలని కూడా రైల్వేలు పరిశీలిస్తున్నాయి.
రైల్వే అధికారుల సమాచారం ప్రకారం.. ఎల్పీజీ కొరత ప్రధానంగా IRCTC బేస్ కిచెన్లపై పడుతోంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఈ బేస్ కిచెన్లలోనే రైళ్లకు సరఫరా చేసే భోజనం ముందుగా తయారు చేస్తారు. దాన్ని ఆ తర్వాత ప్యాంట్రీ కార్లలో లోడ్ చేస్తారు. రైళ్లలో ఉన్న ప్యాంట్రీ కార్లు సాధారణంగా ఫుడ్ సరఫరా చేస్తాయి. సరఫరాకు ముందు, కొన్ని రకాల ఫుడ్స్ ను తయారు చేయడంతో పాటు ఉన్న ఫుడ్స్ ను కేవలం వేడి చేసేందుకు ప్యాంట్రీ కార్లను ఉపయోగిస్తారు. వాటిలో ఎక్కువగా గ్యాస్ సిలిండర్లు ఉండవు. అయితే బేస్ కిచెన్లకు గ్యాస్ సరఫరా తగ్గడం వల్ల సుదూర ప్రయాణ రైళ్లకు భోజనం సిద్ధం చేయడం కష్టంగా మారుతోంది.
ప్రస్తుతం IRCTC దేశ వ్యాప్తంగా రోజుకు సుమారు 17 లక్షల భోజనాలను ప్రయాణికులకు అందిస్తోంది. ఇందులో దాదాపు 20 శాతం భోజనాలు వెస్ట్ జోన్ లోనే సరఫరా అవుతాయి. గ్యాస్ కొరత కొనసాగితే ఆ ప్రాంతంలో సేవలపై ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పరిస్థితి ఇప్పటికే కొంత తీవ్రమైందని రైల్వే అధికారులు తెలిపారు. గ్యాస్ సరఫరా సమస్య ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తవచ్చని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ఇప్పటికే రైల్వే బోర్డుకు తెలియజేసినట్లు వివరించారు.
గ్యాస్ కొరత ఇలాగే కొనసాగితే తాత్కాలికంగా కొన్ని రైళ్లలో భోజన సేవలను నిలిపివేసే అవకాశం ఉందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే, ముందుగా ఫుడ్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు రీఫండ్ ఇవ్వాలని రైల్వే అధికారులు ఆలోచిస్తున్నారు. అయితే, ఈ విషయంపై చివరి నిర్ణయం తీసుకోవాల్సింది రైల్వే బోర్డేనని అధికారులు స్పష్టం చేశారు.
అటు IRCTC కిచెన్లు ప్రస్తుతం గ్యాస్ సరఫరా పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి. సరఫరా సంస్థలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నాయి. కొరత మరింత పెరిగితే కొన్ని రైళ్లలో భోజన సేవలను తాత్కాలికంగా నిలిపివేయడం తప్పదని అధికారులు భావిస్తున్నారు. వచ్చే రెండు, మూడు రోజుల్లో పరిస్థితి ఏంటనేది అర్థం కానుంది.
Read Also: ఫుడ్ సర్వీసెస్ పై ఎల్పీజీ క్రైసిస్ ఎఫెక్ట్, క్లారిటీ ఇచ్చిన ఇండియన్ రైల్వే!