Airport: దేశంలో వివిధ రాష్ట్రాలు ఎయిర్పోర్టులను పెంచాలని భావిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు వాటిపై దృష్టి సారించాయి. ఈ విషయంలో ఏపీ ముందంజలో ఉంది. ఇక దేశంలో మొట్టమొదటి ఆఫ్షోర్ ఎయిర్ పోర్టుకు ప్లాన్ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. వచ్చే ఏడాదిలో దీనికి సంబంధించిన పనులు ప్రారంభించాలని ఆలోచన చేస్తోంది.
ముంబై సిటీకి ఉత్తర ప్రాంతంలో వాధవన్ ఓడరేవు సమీపంలో ఆఫ్షోర్ విమానాశ్రయాన్ని నిర్మించాలని భావిస్తోంది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ తీరప్రాంతంలో మొట్ట మొదటి విమానాశ్రయం కానుంది. ప్రస్తుతం ముంబైలో రెండు ఎయిర్పోర్టులు ఉన్నాయి. ఒకటి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, రెండోది నవీ ముంబైలో విమానాశ్రయం ఉంది.
చేపట్టబోయే మూడో ఎయిర్పోర్టుపై ఫోకస్ చేసింది. ఆఫ్షోర్ విమానాశ్రయం ముంబైకి ఉత్తరాన దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉండనుంది. పాల్ఘర్ జిల్లాలో వాధవన్ ఓడరేవు సమీపంలో రానుంది. దీనివల్ల ముంబై సిటీలో ఉత్తరాది శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి. భారీ లాజిస్టిక్స్, కార్గో హబ్గా సేవలందించడానికి వీలు అవుతుందని అంచనా వేస్తోంది.
ఎయిర్పోర్టుకు రైలు, రోడ్డు నెట్వర్క్లతో అనుసంధానించనుంది. ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్, రవాణా కేంద్రంగా మారనున్నట్లు అంచనా వేస్తోంది. ప్రస్తుత విమానాశ్రయం సామర్థ్యం దాదాపుగా చేరుకున్నట్లు ఓ అంచనా. కొత్త ఆఫ్షోర్ విమానాశ్రయం ఈ ప్రాంతానికి అవసరమైన ఉపశమనాన్ని, భవిష్యత్తుకు అవసరాలను తీరుస్తోందని ఆలోచన చేస్తోంది.
ALSO READ: దేశంలో రెండో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి ఎక్కడో తెలుసా?
కొత్త ఎయిర్పోర్టు ద్వారా పెట్టుబడులను ఆకర్షించడమేకాదు వేలాది ఉద్యోగాలను సృష్టించనుంది. పాల్ఘర్ ప్రాంతం అభివృద్ధికి తిరుగు ఉందని అధికారుల అంచనా. హాంకాంగ్, జపాన్ విమానాశ్రయాలకు ఉపయోగించే అధునాతన ఇంజనీరింగ్ పద్ధతులను ఆఫ్షోర్ ఎయిర్పోర్టుకు ఉపయోగించనుంది.
ఈ ప్రాజెక్ట్ తీర ప్రాంత వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న సముద్ర మట్టాలను తట్టుకునేలా రూపొందించనుంది. మహారాష్ట్ర ప్రభుత్వం.. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా- జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ సహకారంతో సాధ్యాసాధ్యాల అధ్యయనాలు చేస్తోంది. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఈ ప్రాజెక్టును దశలవారీగా అభివృద్ధి చేయాలని భావిస్తోంది.
2026లో పనులు మొదలుపెట్టి, తొలి దశ 2032 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. విమానాశ్రయం రూపకల్పనలో పర్యావరణ ప్రభావం తక్కువగా ఉండేలా ప్రయార్టీ ఇవ్వనుంది. విస్తృతమైన మడ అడవుల సంరక్షణ, పరిహార చర్యలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది.