Mumbai Airport Close: ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం 6 గంటల పాటు మూత పడనుంది. నవంబర్ 20(గురువారం)న ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు అన్ని రన్ వే కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (MIAL) అధికారికంగా ప్రకటించింది. ప్రపంచ విమానయాన ప్రమాణాలకు అనుగుణంగా సేఫ్టీ, రిలయబులిటీ పెంచే చర్యల్లో భాగంగా షెడ్యూల్ చేసిన రన్ వేలను క్లోజ్ చేస్తున్నట్లు తెలిపారు.
ముంబై విమానాశ్రయంలో రెండు రన్ వేలు ఉన్నాయి. మెయిన్ రన్ వే 9/27, సెకెండరీ రన్ వే 14/32. ఇవి రోజుకు 950 విమాన రాకపోకలను నిర్వహిస్తాయి. ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత రెండవ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. విమానయాన సంస్థలు, ఇతర స్టాక్ హోల్డర్లు విమాన షెడ్యూల్ లను, మ్యాన్ పవర్ ప్లాన్స్ ను బంద్ కు అనుగుణంగా సర్దుబాటు చేసుకునేందుకు వీలుగా ఎయిర్ మెన్ కు ముందుగానే నోటీసు జారీ అయ్యింది. కమ్యూనికేషన్ కార్యకలాపాలలో మరింత సజావుగా సమన్వయం చేసుకోవడం, ప్రయాణీకుల అసౌకర్యాన్ని తగ్గించేలా చర్యలు చేపడుతున్నట్లు MIAL తెలిపింది.
సాధారణంగా NOTAM అనేది విమాన కార్యకలాపాలలో పాల్గొనే సిబ్బందికి అవసరమైన సమాచారాన్ని అందించే నోటీసు. మెయింటెనెన్స్ లో భాగంగా తనిఖీలు, మరమ్మతులు, రన్ వే లైటింగ్, సిగ్నల్స్, డ్రైనేజీ వ్యవస్థల సాంకేతిక అంచనాలు ఇందులో రాసి ఉంటాయి. ఇందుకు అనుగుణంగా ఆయా విమానయాన సంస్థలు ప్రయాణీకులకు సమాచారం అందిస్తాయి.
https://twitter.com/CSMIA_Official/status/1990748259900608843
Read Also: గాల్లో ఉండగా.. ఎయిర్ ఇండియా ఫ్లైట్లో సాంకేతిక లోపం, 155 మంది ప్రయాణికులు సురక్షితం!
అటు నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) డిసెంబర్ 25 నుంచి వాణిజ్య విమాన కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. తొలుత 23 షెడ్యూల్డ్ రోజువారీ రాకపోకలు ఉంటాయి. మొదటి నెలలో విమానాశ్రయం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 12 గంటలు పని చేస్తుంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR)లో రెండవ ప్రధాన విమానాశ్రయం అయిన NMIAను అక్టోబర్ 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రారంభ దశలో, ఈ విమానాశ్రయం రోజుకు దాదాపు 120 విమాన రాకపోకలను నిర్వహిస్తుంది. ఫిబ్రవరి 2026 నుంచి ఈ విమానాశ్రయం 24 గంటలూ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. NMIA మొదటి దశను రూ. 19,650 కోట్ల వ్యయంతో నిర్మించారు. 1,160 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ విమానాశ్రయం మొదటి దశలో ఒక టెర్మినల్, ఒక రన్వే ను కలిగి ఉంటుంది. ఏడాదికి ప్రయాణీకుల నిర్వహణ సామర్థ్యం 20 మిలియన్లు.
Read Also: బెంగళూరులో మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, అందుబాటులోకి వచ్చేది ఎప్పుడంటే?