Mumbai Dubai Flight Radar: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాలుస్తుంది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేస్తున్నాయి. తమ సుప్రీం లీడర్ ఖమేనీ మరణానంతరం ఇరాన్ దాడులను తీవ్రం చేసింది. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతుంది. దీంతో దుబాయ్, అబుదాబి సహా యూఏఈ దేశాల్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి.
పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకున్న వారిని తరలించేందుకు పలు దేశాలు పరిమిత సంఖ్యలో విమానాలు నడుపుతున్నాయి. ముఖ్యంగా దుబాయ్, అబుదాబీ, షార్జా ఎయిర్ పోర్టుల నుంచి భారత్కు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో ముంబయి నుంచి దుబాయ్ వెళ్తోన్న ఓ విమానానికి.. అనుకోని పరిణామం ఎదురైంది. విమానం గగనతలంలో ఉండగా యూఏఈపై క్షిపణి దాడులు జరుగుతున్నాయని హెచ్చరికలు వచ్చాయి. దీంతో దుబాయ్ విమానం రెండు సార్లు వెనక్కి వచ్చింది. చివరకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దుబాయ్ ఎయిర్పోర్టులో ల్యాండ్ చేశారు.
ఫ్లైట్రాడార్ 24 డేటా ప్రకారం, ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను దుబాయ్ ఎయిర్ ఫోర్స్ ఎదుర్కొంటుందని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. దీంతో ముంబయి నుంచి దుబాయ్కు బయలుదేరిన ఎమిరేట్స్ విమానం EK501 మంగళవారం ఉదయం యూఏఈ గగనతలం వెలుపల నిలిచిపోయింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ చేరుకున్న తర్వాత తన దిశను మార్చుకొని తిరిగి ముంబయి వైపు బయలుదేరింది. ఇలా రెండుసార్లు గగనతలంలోనే వెనక్కి వచ్చింది. చివరకు దుబాయ్ ఎయిర్ పోర్టు ల్యాండ్ అయింది.
Also Read: గల్ఫ్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. ప్రత్యేక విమానాలు నడుపుతున్న ఇండిగో
ఈ అనుకోని పరిణామానికి సంబంధించిన రాడార్ ఫొటో వైరల్గా మారింది. ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైట్, ఇరాక్, మరికొన్ని దేశాల్లోని యూఎస్ స్థావరాలపై ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులను ప్రారంభించింది. తాజాగా ఈ వివాదం లెబనాన్కు కూడా విస్తరించింది. ఇరాన్ మద్దతుగా.. మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా యుద్ధంలోకి ఎంటరైంది. మరోవైపు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను తీవ్రం చేశాయి. ఇరాన్ దాడులతో దుబాయ్, అబుదాబీ ఎయిర్పోర్టుల్లోని కొన్ని టెర్మినల్లు స్వల్పంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే.