Harish Rao: అక్రమ క్వారీలతో ప్రజల సొమ్మును కొల్లగొడుతున్న మైనింగ్ మాఫియాపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ మాఫియా గలీజ్ గలీజ్ దందా చేస్తుంటే రెవెన్యూ, మైనింగ్, పీసీబీ, హెచ్ఎండీఏ అధికారులు ఎందుకు అటువైపు కన్నెత్తి చూడటం లేదని ధ్వజమెత్తారు. రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో బండరాళ్లను తొలుస్తూ, అక్రమంగా తరలిస్తూ యదేచ్చగా వ్యాపారం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఓఆర్ఆర్కు సమీపంలో ఓ కన్స్ట్రక్షన్స్ సంస్థ ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా అక్రమ క్వారీలు నిర్వహిస్తూ కొండలను పిండిచేస్తోందని హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నించారు. నెలల తరబడి కొండలను పిండి చేసి భారీగా కాంక్రీటు తరలింపు జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖలు ఎందుకు మౌనం పాటిస్తున్నాయని నిలదీశారు.
యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు మొద్దు నిద్ర నటిస్తున్నట్లు అని ప్రశ్నించారు. ఆయా శాఖల్లోని విజిలెన్స్ విభాగాలు పని చేయడం లేదా? అని విమర్శించారు. టీఎస్పీసీబీ నుంచి కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్ మెంట్ (సీఎఫ్ఈ), కన్సెంట్ ఫర్ ఆపరేషన్ (సీఎఫ్ఓ) అనుమతి లేదని.. అలాగే పర్యావరణ అనుమతి కూడా వాటికి లేదన్నారు. పేలుడు పదార్థాలు, గ్రౌండ్ వాటర్ వినియోగానికి సంబంధిత అనుమతులు లేవని స్పష్టం చేశారు.
మరోవైపు క్వారీ కోసం ఎలాంటి బిడ్డింగ్ లేకుండా గంపగుత్తగా 17 ఎకరాల ప్రభుత్వ భూమి నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిలో కట్టబెడతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం జరుగుతున్నదని, ఓపెన్ బిడ్డింగ్ పిలవాలని తాము డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం నుంచి స్పందన లేదని మండిపడ్డారు.
అసలు రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వమా? లేక రియల్ ఎస్టేట్ కంపెనీనా? అని హరీశ్ రావు నిలదీశారు. ప్రభుత్వ ఆస్తిని ఓ మంత్రి కంపెనీ అప్పనంగా తన్నుకు పోతుంటే ఎందుకు ప్రొటెక్ట్ చేయడం లేదు? అని ఆరోపించారు. శని, ఆదివారాలు వచ్చిందంటే చాలు పేదల ఇళ్ల మీదకు వెళ్లే హైడ్రా బుల్డోజర్ కు ప్రభుత్వ భూమిలో ఉన్న ఈ అక్రమ క్వారీ కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.