India’s Mysterious Alien Temple: దేవుళ్లకు ఆలయాలు ఉంటాయి. భక్తి భావన పెంచుకుని ప్రశాంతంగా ఉండేందుకు ప్రజలంతా కలిసి గుళ్లు కటిస్తుంటారు. కొంత మంది ఓ అడుగు ముందుకేసి తమ అభిమాన హీరోలు, హీరోయిన్లకు గుడి కట్టడం చూశాం. మహాత్మాగాంధీ, డొనాల్డ్ ట్రంప్ లాంటి నాయకులకూ గుడి కట్టించిన ఘటనలు చూశాం. కానీ, ఏలియన్ కు గుడి కట్టడం ఎప్పుడైనా చూశారా? రెగ్యులర్ గా పూజలు చేయడం గమనించారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం. నమ్మడం లేదా? అయితే, ఈ స్టోరీ చదివేయండి.
ఏలియన్ గుడి పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఉంది. సేలం జిల్లాలో ఓ వ్యక్తి ఏకంగా గ్రహాంతరవాసికి ఆలయం కట్టి, నిత్యం పూజలు చేస్తున్నాడు. ఈ ఆలయం మల్లమూప్పన్ పట్టి సమీపంలోని రామగౌండనూర్ ఉంటుంది. అదే గ్రామానికి చెందిన సిద్ధర్ భాగ్య కొద్ది సంవత్సరాల క్రితం స్థానికంగా శివాలయాన్ని నిర్మించాడు. ఆయలం పేరు ‘కైలాయ శివాలయం’. ఈ ఆలయంలో మూలమూర్తిగా శివలింగం ప్రతిష్ఠ చేశాడు. అండర్ గ్రౌండ్ లోని ఓ మండపంలో అగస్త్య మహర్షి విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. మరో మండపంలో ఏకంగా ఏలియన్ విగ్రహాన్ని ప్రతిష్టించాడు. ఈ ఏలియన్ ను దేవుళ్లతో సమానంగా పూజలు చేస్తున్నారు. నలుపు రాయితో తయారు చేసిన ఈ ఏలియన్ విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది. ఆలయానికి వచ్చే భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
ఏలియన్ కు ఆలయం నిర్మించడం పట్ల సిద్ధర్ భాగ్య ఆసక్తికర విషయాలు చెప్పాడు. శివుడు ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత గ్రహాంతరవాసులు పుట్టారని చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని అగస్త్య మహర్షి తన గ్రంథాలలో రాసిన విషయాన్ని గుర్తు చేశాడు. అందుకే, ఏలియన్ విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నట్లు చెప్పాడు. అంతేకాదు, తాను గ్రహాంతర దేవతలతో కూడా మాట్లాడానని చెప్పాడు. ఆలయ నిర్మాణానికి ముందు తమ ఊరికి ఓ ఏలియన్ వచ్చాడని, ఆయనతో మాట్లాడానని చెప్పాడు. ఏలియన్ కు ఏకంగా 18 భాషలు కూడా వచ్చని చెప్పాడు. ఈ గుడిని నిర్మించేందుకు అతడి నుంచి అనుమతి కూడా పొందినట్లు వివరించాడు. ప్రకృతి వైపరీత్యాలను గ్రహాంతర దేవతలు కాపాడగలవని తాను విశ్వసిస్తున్నట్లు ఆయన వివరించారు.
అంతేకాదు, సిద్ధర్ భాగ్య ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతడు మనిషి కాదని, మనిషి రూపంలో ఉన్న ఏలియన్ అని చెప్పేశాడు. తాను నూటికి నూరు శాతం ఈ విషయాన్ని నమ్ముతున్నట్లు వెల్లడించాడు. అందుకే, ఆయన టెక్నాలజీ రంగంలో ఎవరికీ సాధ్యంకాని కొత్త ఆవిష్కరణలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. మొత్తంగా ఈ ఏలియన్ ఆలయం తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఏలియన్ ఆలయం ఎక్కడైనా ఉందంటే, అది ఇదే అంటున్నారు. ఒకవేళ మీరు కూడా తమిళనాడుకు వెళ్తే, ఈ ఏలియన్ ఆలయాన్ని చూసి తరించండి!
Read Also: భార్య కోసం తాజ్ మహల్ కట్టేసిన భర్త, నిజంగా నువ్ గ్రేట్ భయ్యా!