BIG TV LIVE Originals: దక్షిణాదిలో అతిపెద్ద రైల్వే స్టేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. నార్త్, సౌత్ ను లింక్ చేస్తూ, ప్రజా రవాణాతో పాటు సరుకు రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది. సుమారు 150 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ రైల్వే స్టేషన్ నుంచి రోజూ వందలాది రైళ్లు రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ స్టేషన్ సరికొత్తగా పునర్నిర్మాణం అవుతోంది. ప్రస్తుత పాత రైల్వే స్టేషన్ ను పూర్తిగా కూల్చేసి కొత్తగా నిర్మిస్తున్నారు. విమానాశ్రయానికి ఏమాత్రం తీసిపోని రీతిలో పునర్నిర్మాణం అవుతోంది. 2026 నాటికి ఈ రైల్వే స్టేషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులు కొనసాగుతున్నాయి. ఈ రైల్వే స్టేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 715 కోట్లు కేటాయించింది. ఇంతకీ ఈ రైల్వే స్టేషన్ లో కల్పించే అత్యాధునిక వసతులు ఏంటో ఇప్పుడు చూద్దాం..
⦿ కొత్త రూఫ్ ప్లాజా
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రూఫ్ ప్లాజాను అద్భుతంగా తీర్చిదిద్దనున్నారు. ప్రయాణీకులు కూర్చుని, విశ్రాంతి తీసుకోవడానికి, ఫుడ్ ఆస్వాదించడానికి అత్యంత విశాలంగా నిర్మించనున్నారు. ఇందులో షాపులు, కేఫ్లు, తెలంగాణ స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేయనున్నారు.
⦿ లిఫ్ట్లు, ఎస్కలేటర్లు
రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణీకులు ఎలాంటి ఇబ్బంది పడకుండా లిఫ్ట్ లు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్టేషన్ లో మొత్తం 26 లిఫ్ట్లు, 32 ఎస్కలేటర్లు, 2 మూవింగ్ వాక్ వేస్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
⦿ఈజీ కనెక్షన్స్
ఈ స్టేషన్ కు ఇతర రవాణ సంస్థలతో కలిసి మెరుగైన కనెక్టివిటీ ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ స్టేషన్ కు తూర్పు, పశ్చిమ వైపున మెట్రో స్టేషన్లు, ప్రయాణీకులు ఈజీగా నగరంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లేలా బస్ స్టేషన్లను నిర్మించనున్నారు. వీటి ద్వారా ప్రజలు సులభంగా రాకపోకలు కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
⦿ మరిన్ని పార్కింగ్ స్థలాలు
రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణీకులకు మెరుగైన పార్కింగ్ సదుపాయాలు కల్పించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. కొత్త పార్కింగ్ భవనాలను నిర్మిస్తున్నారు. నార్త్ వైపు మల్టీ లెవెల్ పార్కింగ్ ఏరియాను ఏర్పాటు చేస్తున్నారు. సౌత్ వైపు అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. స్టేషన్ బయట ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
⦿ ఎకో ఫ్రెండ్లీ ఫీచర్లు
ఈ రైల్వే స్టేషన్ పూర్తిస్థాయిలో ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. స్టేషన్ అంతా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్టేషన్ కు అవసరం అయిన విద్యుత్ కోసం సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేయనున్నారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇవి మురుగు నీటిని రీసైకిల్ చేసి, కాలుష్యాన్ని తగ్గిస్తాయి.
⦿మోడ్రన్ బిల్డింగ్స్
స్టేషన్ కు రెండు వైపులా అత్యాధునిక డిజైన్లతో కొత్త స్టేషన్ భవనాలను నిర్మిస్తారు. ఇవి మూడు అంతస్తులుగా(G+3) ఉంటాయి. ఇందులోనే వెయిటింగ్ హాల్స్, ఫుడ్ కోర్టులు, టికెట్ కౌంటర్లు, ఆధునిక టికెటింగ్ కేంద్రాలు ఉంటాయి.
పునర్నిర్మాణం తర్వాత ఈ రైల్వే స్టేషన్ దేశంలోనే అత్యంత ఆధునిక రైల్వే స్టేషన్లలో ఒకటిగామారనుంది. అత్యంత సౌకర్యవంతంగా, శుభ్రంగా, ప్రయాణీకులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించే ప్రాంతంగా మారనుంది.
Read Also: సికింద్రాబాద్ ప్లాట్ ఫారమ్స్ మూసివేత, ఇక రైళ్ల రాకపోకలు అన్నీ అక్కడి నుంచే!
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA ద్వారా కంప్లైట్ ఫైల్ చేయబడుతుంది.