Train Delay Costs Indian Railways: రైల్వే చేసిన తప్పులకు ప్రయాణికులు తరచుగా ఇబ్బంది పడిన సందర్భాలున్నాయి. తాజాగా ఇలాంటి కేసు విషయంలో వినియోగదారుల ఫోరమ్ కీలక తీర్పు వెల్లడించింది. రైలు ఆలస్యమవడంతో విమానం మిస్ అయిన ప్రయాణికుడికి భారీ నష్టపరిహారం చెల్లించాలని రైల్వేను ఆదేశించింది. ఈ కేసులో రైల్వే తప్పు ఉందని తేల్చిన ఒడిశాలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్, ప్రయాణికుడికి రూ.1.3 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.
2024 ఆగస్టు 23న.. చండీ ప్రసాద్ ఖమారి అనే ప్రయాణికుడు ఝార్సుగూడ నుంచి హౌరాకు వెళ్లే రైలు నెంబర్ 12129కి టికెట్ బుక్ చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ రైలు రాత్రి 7.50 గంటలకు బయలుదేరి, తెల్లవారుజామున 3.55 గంటలకు హౌరా చేరుకోవాల్సి ఉంది. అక్కడి నుంచి ఉదయం 8.05 గంటలకు గౌహతికి వెళ్లే విమానం ఎక్కడానికి ఆయన ప్లాన్ చేసుకున్నారు. అంటే రైలు సమయానికి చేరితే ఫ్లైట్కు వెళ్లడానికి సరిపడ సమయం ఉండేది.
కానీ, ఆ రోజు రైలు సమయానికి రాలేదు. ఝార్సుగూడ నుంచి రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరిన రైలు, చివరికి కోల్కతాకు దాదాపు ఏడు గంటలు ఆలస్యంగా చేరుకుంది. దీంతో ఖమారి ముందుగా బుక్ చేసుకున్న విమానం మిస్ అయింది. ఫ్లైట్ రద్దు చేసుకోవడం, కొత్త టికెట్ బుక్ చేయడం వల్ల భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. మానసికంగా కూడా ఇబ్బందులు పడ్డాడు. ఈ విషయంపై రైల్వే అధికారులను పలుమార్లు సంప్రదించినా సరైన సమాధానం రాలేదని ఖమారి వెల్లడించారు. దీంతో ఆయన వినియోగదారుల ఫోరమ్ ను ఆశ్రయించాడు. రైల్వే మాత్రం తమపై వచ్చిన ఆరోపణలను ఖండించాయి. రైళ్లు సమయానికి నడుస్తాయని ఎక్కడా హామీ ఇవ్వలేమని, నిర్వహణ, భద్రతా కారణాల వల్ల ఆలస్యం జరగవచ్చని వాదించాయి.
రైల్వే వాదనలను వినియోగదారుల ఫోరం అంగీకరించలేదు. రైల్వే ప్రజా సేవా సంస్థగా బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేసింది. ఆలస్యం తమ నియంత్రణకు మించినదని నిరూపించలేకపోయినందున, రైల్వే బాధ్యత వహించాలని పేర్కొంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఉదహరిస్తూ, సరైన ఆధారాలు లేకుండా బాధ్యత తప్పించుకోవడం కుదరదని తెలిపింది. ఈ నేపథ్యంలో, ప్రయాణికుడికి జరిగిన నష్టాన్ని పరిగణలోకి తీసుకుని పరిహారం ప్రకటించింది. విమానం రద్దు, రీబుకింగ్ ఖర్చులకు రూ. 20,000, మానసిక వేదనకు రూ.30,000, కేసు ఖర్చులకు రూ. 5,000 చెల్లించాలని ఆదేశించింది. అలాగే నిర్ణీత 30 రోజుల్లో ఈ మొత్తాన్ని చెల్లించకపోతే, రోజుకు రూ.500 చొప్పున అదనపు జరిమానా విధించాలని కూడా తెలిపింది.
రైల్వే వినియోగదారుల ఫోరమ్ ఈ ఆదేశాన్ని సమయానికి అమలు చేయకపోవడంతో జరిమానా రోజురోజుకు పెరిగింది. 200 రోజులకు పైగా ఆలస్యం కావడంతో మొత్తం మొత్తం సుమారు రూ.1.3 లక్షలకు చేరుకుంది. చివరికి ఈ మొత్తాన్ని ప్రయాణికుడికి చెల్లించారు. రైల్వే లాంటి ప్రజా రవాణా సంస్థలు ఆలస్యాన్ని తగ్గించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వినియోగదారుల ఫోరమ్ స్పష్టం చేసింది.
Read Also: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్, రాజమండ్రి-విశాఖపట్నం రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్!