Big Boost for Andhra Pradesh Railways: ఆంధ్రప్రదేశ్ లో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో.. రాజమండ్రి–విశాఖపట్నం మధ్య రైల్వే సామర్థ్యాన్ని పెంచే కీలక ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. దాదాపు రూ.9,889 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ లో, నిడదవోలు నుంచి దువ్వాడ వరకు సుమారు 198 కిలోమీటర్ల పొడవున మూడో, నాలుగో లైన్లు నిర్మించనున్నారు.
ప్రస్తుతం ఈ మార్గం దేశంలో అత్యంత రద్దీగా ఉండే హౌరా–చెన్నై రైల్వే కారిడార్లో భాగంగా ఉంది. ఇప్పటికే ఈ మార్గంలో పరిమితికి మించి రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తరచుగా రైళ్లు ఆలస్యం అవుతున్నాయి. ఈ సమస్యను తొలగించేందుకు కేంద్రం కొత్త లైన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల మీదుగా వెళ్తుంది. ఏపీ తూర్పు తీరం వెంట ఉన్న ముఖ్య ప్రాంతాల మధ్య అనుసంధానంలో కీలక పాత్ర పోషిస్తుంది. అటు పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ లక్ష్యాలకు అనుగుణంగా, రోడ్డు, రైలు, పోర్ట్ కనెక్టివిటీని సమగ్రంగా అభివృద్ధి చేయడంలో ఈ రైల్వే ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుంది.
విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం లాంటి ప్రధాన పోర్టులను కలుపుతూ వెళ్లే ఈ మార్గం అత్యంత కీలకమైనది. సరుకు రవాణాలో ముఖ్యమైన పాత్ర పోషించనుంది. అదనపు లైన్లు ఏర్పడితే, ప్రతి సంవత్సరం సుమారు 29 మిలియన్ టన్నుల వరకు అదనపు సరుకును రవాణా చేయగల సామర్థ్యం పెరుగుతుంది. బొగ్గు, సిమెంట్, ఎరువులు, ఉక్కు, ధాన్యాలు, కంటైనర్లు లాంటి సరుకుల రవాణా వేగవంతం అవుతుంది.
ఇంజనీరింగ్ పరంగా కూడా ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతను కలిగి ఉంది. గోదావరి నదిపై సుమారు 4.3 కిలోమీటర్ల పొడవైన రైల్వే వంతెన నిర్మాణం, 2.67 కిలోమీటర్ల వయాడక్ట్, మూడు బైపాస్ లైన్లు ఇందులో భాగంగా ఉంటాయి. కొత్త మార్గం ప్రస్తుత మార్గంతో పోలిస్తే సుమారు 8 కిలోమీటర్లు తక్కువగా ఉండటం వల్ల ప్రయాణ సమయం తగ్గుతుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల పరిశ్రమలకే కాకుండా పర్యాటక రంగానికీ లాభం కలుగుతుంది. అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామం లాంటి పుణ్యక్షేత్రాలకు చేరుకోవడం సులభం అవుతుంది. ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. పర్యావరణ పరంగా కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. రోడ్డు రవాణాతో పోలిస్తే భారీగా కాలుష్యం తగ్గుతుంది. సంవత్సరానికి రూ.1,150 కోట్ల వరకు లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ అమలైతే, ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరం అభివృద్ధికి కేరాఫ్ గా మారే అవకాశం ఉంటుంది.
Read Also: జస్ట్ 3 గంటల్లోనే హైదరాబాద్-ముంబై జర్నీ.. హైస్పీడ్ ట్రైన్ వచ్చేస్తోంది!