నిత్యం బిజీ బిజీగా ఉండే జపాన్ రాజధాని నగరం టోక్యో.. ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఎక్కడి రైళ్లు అక్కడ నిలిచిపోవడంతో ప్రజలు ముప్పుతిప్పలు పడ్డారు. అదేంటీ.. అన్నీట్లో పర్ఫెక్ట్ అనిపించుకొనే జపాన్లో ఇలాంటి సమస్యా అని ఆశ్చర్యపోతున్నారా? అక్కడ ప్రజాజీవనం ఎందుకు స్పందించిపోయిందని అనుకుంటున్నారా? దీనికి కారణం విద్యుత్ అంతరాయం.
ఎన్నడూలేని స్థాయిలో ట్యోక్యోలో రైల్వేకు విద్యుత్తును సరఫరా చేసే రెండు మెయిన్ లైన్లలో అంతరాయం ఏర్పడింది. దీనివల్ల ప్రజలు ముప్పు తిప్పలు ఎదుర్కొన్నారు. సరిగ్గా ఆఫీసులకు వెళ్లే సమయంలోనే ఈ సమస్య ఏర్పడింది. దానివల్ల ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. దీంతో 6.73 లక్షల మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో పడిగాపులు కాయాల్సి వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత బిజీయెస్ట్ రైల్వే స్టేషన్లుగా పేరొందిన యామానటే, కెయిహిన్-టోహోకు లైన్లలో రైళ్లు ముందుకు కదల్లేదు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 9 గంటల సేపు రైళ్లు నిలిచిపోయాయి.
ఈ సమస్యపై జేఆర్ ఈస్ట్ సంస్థ స్పందిస్తూ.. ట్యోక్యోలోని తమాచీ స్టేషన్ వద్ద గురువారం రాత్రి మెయింటెనెన్స్ పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్తు సరఫరా నిలిపేశారు. అయితే, పనులు పూర్తయిన తర్వాత మళ్లీ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేకపోయారు. ఆ సమయంలో రైల్వే ట్రాక్ సమీపంలోని ఎక్విప్మెంట్ బాక్స్ వద్ద పొగలు రావడాన్ని సిబ్బంది గమనించారని, ముందు జాగ్రత్తగా విద్యుత్తు నిలిపేశామని అధికారులు తెలిపారు.
ఆ మార్గంలో నిర్విరామంగా రైళ్లు నడుస్తూనే ఉంటాయి. విద్యుత్ అంతరాయం ఏర్పడే సమయానికి కూడా కొన్ని రైళ్లు రాకపోకలు సాగించాయి. విద్యుత్తు నిలిచిపోగానే ఆ రైళ్లన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మొదట్లో చిన్న సాంకేతి సమస్య కావచ్చని భావించారు. అయితే, గంటలు గడుస్తున్నా రైళ్లు కదలకపోవడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. వేరే దారి లేకపోవడంతో ప్రయాణికులు మధ్య దారిలోనే దిగిపోయి ట్రాక్ల మీద నడుచుకుంటూ వెళ్లిపోయారు.
అయితే, వారికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేసిందా లేదా అనేది తెలియరాలేదు. అయితే, రైళ్ల కోసం వేచి చూస్తున్న ప్రయాణికులు అక్కడి రైల్వే స్టేషన్లన్నీ కిక్కిరిసిపోయాయి. డైలీ 35 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు చేసే షింజుకు రైల్వే స్టేషన్లో కూడా సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉండి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.