Chamala Kiran Kumar Reddy: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కనుమ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూనే, రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న జర్నలిస్టుల అరెస్టులు, మీడియా కథనాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ ఛానల్లో వచ్చిన ‘ఆఫ్ ద రికార్డు’ కథనం వల్ల తలెత్తిన పరిణామాలు, ఆ తర్వాత జరిగిన అరెస్టులు బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజకీయ నాయకులు, అధికారుల వ్యక్తిగత జీవితాలను ప్రభావితం చేసేలా ఆధారాలు లేని వార్తలు రాయడం సరికాదని ఆయన సూచించారు. “ఒకప్పుడు సంపూర్ణమైన ఆధారాలతో మీడియాలో వార్తలు వచ్చేవి, కానీ ఇప్పుడు కేవలం ఊహించి కథనాలు రాస్తున్నారు. దీనివల్ల అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంత మానసిక వేదనకు గురవుతున్నారో అర్థం చేసుకోవాలి. ఒక ఉన్నత చదువులు చదువుకున్న అధికారిణి, ఒక క్యాబినెట్ మంత్రి సమాజం ముందు ఎంత బాధపడ్డారో మనం చూశాం.” అని చామల పేర్కొన్నారు.
ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడం వల్లే ఇలాంటి అసత్య ప్రచారాలకు ఎక్కడో ఒకచోట ముగింపు పలకాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన వివరించారు. ఈ సందర్భంగా మీడియాపై తనకున్న గౌరవాన్ని చాటుతూ.. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా, నేను అయినా ఈ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం మీడియానే. జర్నలిస్టులు, మీడియా సంస్థల పట్ల మాకు ఎప్పుడూ అభిమానం ఉంటుంది. సమాజానికి మీడియా అవసరం ఎంతో ఉంది. నాయకులు తప్పు చేసినా, అవినీతికి పాల్పడినా నిర్భయంగా వార్తలు రాయవచ్చు” అని ఆయన స్పష్టం చేశారు.
సోషల్ మీడియా ఛానళ్లను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ, వ్యక్తుల కుటుంబ సభ్యులు ఇబ్బంది పడేలా వార్తలు వేయవద్దని చామల కోరారు. “వ్యవస్థ నడవాలంటే ఊహలతో సాధ్యం కాదు. వాస్తవాలు, ఆధారాలు లేని వార్తలు రాకుండా చూడాల్సిన బాధ్యత మీడియా యాజమాన్యాలపై ఉంది” అని ఆయన హితవు పలికారు.
Read Also: రోడ్డుపై కారు దగ్ధం.. చెలరేగిన మంటలు, మేడారం వెళ్లి వస్తుండగా ఘటన