Awadh Express Pantry Car Raid: రైల్వే ఫుడ్ క్వాలిటీ గురించి ప్రయాణీకుల నుంచి తరచుగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఆయా కంప్లైంట్స్ మీద అధికారులు స్పందిస్తూనే ఉన్నారు. మంచి ఫుడ్ అందించాలని ఆదేశిస్తున్నారు. నిబంధనలను పట్టించుకోని కాంట్రాక్టర్లకు జరిమానాలు విధిస్తూనే ఉన్నారు. అయినా, చాలా మంది తీరుమారడం లేదు. తాజాగా అవధ్ ఎక్స్ ప్రెస్ లోని ప్యాంట్రీ కారును ఆకస్మికంగా తనిఖీ చేసిన అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. పెద్ద మొత్తంలో కుళ్ళిన ఆలుగడ్డలు, చెడిపోయిన గుడ్లు డజన్లలకొద్ది బయటపడ్డాయి. కాంట్రాక్టర్ తీరుపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెడిపోయిన కూరగాయలు, గుడ్లు సహా ఇతర పదార్థాలను బయటపడేయడంతో పాటు కాంట్రాక్టర్ కు భారీ జరిమానా విధించాలని DCM కిషోర్ పటేల్ స్థానిక రైల్వే అధికారులను ఆదేశించారు.
కోటా రైల్వే స్టేషన్ లో తనిఖీలు
కోటా రైల్వే స్టేషన్లోని ప్లాట్ ఫామ్ నంబర్ 1లో ఆపిన బాంద్రా-బరౌలి అవధ్ ఎక్స్ ప్రెస్ (19037) ప్యాంట్రీ కారును డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కిషోర్ పటేల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సమయంలో ప్రయాణీకులకు వడ్డించడానికి ఫుడ్ సిద్ధం చేస్తున్న ప్యాంట్రీ కారు నుంచి పెద్ద మొత్తంలో కుళ్ళిన బంగాళాదుంపలు, చెడిపోయిన గుడ్లను గుర్తించారు. ప్యాంట్రీ కారులో తయారు చేస్తున్న పోహా, పప్పు, చిక్ పీ కర్రీ క్వాలిటీని పరిశీలించారు. అస్సలు బాగాలేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహారంలో పదార్థాలు నాసిరకంగా ఉన్నట్లు గుర్తించారు. కుళ్ళిన, చెడిపోయిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని డస్ట్ బిన్ లో పడేయించారు.
ప్యాంట్రీ కారులో అపరిశుభ్రత
అంతేకాదు, శుభ్రంగా ఉండాల్సిన పాంట్రీ కారు అపరిశుభ్రతతో నిండిపోయి ఉండటంపై DCM కిషోర్ పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు అంతటా దుమ్ము, దుమారంతో పాటు చెత్త పేరుకుపోయి ఉండటం పట్ల ఆయన సీరియస్ అయ్యారు. ఆహార భద్రతా నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ప్యాంట్రీ కారులోని చెడిపోయిన ముడి ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని రైల్వే పార్శిల్ కార్యాలయంలో భద్రపరిచారు. అదే సమయంలో పాంట్రీ కాంట్రాక్టర్, పాంట్రీ కార్ మేనేజర్ను మందలించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకూడదని ఆదేశించారు. కాంట్రాక్టర్ కు భారీ జరిమానా విధించాలని స్థానిక రైల్వే అధికారులను ఆదేశించారు.
Read Also: మేడారం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, 28 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన సౌత్ సెంట్రల్ రైల్వే!
అటు ఈ ఘటనపై కోటా డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సౌరభ్ జైన్ రియాక్ట్ అయ్యారు. రైళ్లలోని క్యాటరింగ్ వ్యవస్థను క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. అవధ్ ఎక్స్ ప్రెస్ ఘటనకు సంబంధించి పాంట్రీ ఏజెన్సీ, IRCTCకి సమాచారం అందిందంన్నారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందన్న ఆయన, నివేదిక తర్వాత చర్యలు ఉంటాయన్నారు.
Read Also: వందేభారత్ స్లీపర్ లో బ్లాంకెట్స్ కు కవర్లు, ఇక ఈజీగా ఉతికేయొచ్చు!