Sankranti Special Trains: సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ. ఉపాధి, ఉద్యోగ కారణాలతో సొంత ఊర్లను విడిచి పట్టణాలకు వలస వెళ్లిన వారంతా సంక్రాంతి మూడు రోజులు తమ స్వగ్రామంలో గడపాలని కోరుతుంటారు. అందుకే దేశంలో ఎక్కడున్నా.. సంక్రాంతి సొంత ఊరుకు వస్తుంటారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. సంక్రాంతి ప్రత్యేక రైళ్లకు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయనుంది. ప్రయాణికులు ముందస్తు బుకింగ్ లు చేసుకోవాలని సూచించింది దక్షిణ మధ్య రైల్వే.
సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో పలు ప్రత్యేక రైళ్లను నడపడానికి దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 4, 11, 18 తేదీల్లో సికింద్రాబాద్-అనకాపల్లె(రైలు నెంబర్ 07041), జనవరి 5, 12, 19 తేదీల్లో అనకాపల్లె- సికింద్రాబాద్ (రైలు నెం.07042) ప్రత్యేక రైలును నడుపనున్నట్లు ప్రకటించింది. జనవరి 9, 16, 23 తేదీల్లో హైదరాబాద్-గోరక్పూర్(రైలు నెం.07075), జనవరి 11, 18, 25 తేదీల్లో గోరక్పూర్-హైదరాబాద్ (రైలు నెం.07076) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. డిసెంబర్ 21న మచిలీపట్నం- అజ్మీర్ (రైలు నెం.07274), 28న అజ్మీర్-మచిలీపట్నం(రైలు నెం.07275) ప్రత్యేక రైలును నడపనున్నారు.
విశాఖ-లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు సమయాల్లో మార్పులు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఫిబ్రవరి 15 నుంచి ఇరువైపులా ఈ రైలు సమయాల్లో మార్పులు అమల్లోకి వస్తాయని సీపీఆర్ఓ శ్రీధర్ వెల్లడించారు.
శబరిమలకు వెళ్లే భక్తుల కోసం జనవరిలో నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. చర్లపల్లి-కొల్లాం మధ్య ప్రత్యేక రైళ్లకు నడుపుతున్నారు. ఈ రైళ్లు కాచిగూడ, కర్నూలు, డోన్, గుత్తి, కడప, తిరుపతి, కాట్పాడి, ఈరోడ్, త్రిచూర్, ఎర్నాకుళం స్టేషన్లలో ఆగనున్నాయి. జనవరి 14, 21 తేదీల్లో ప్రత్యేక రైలు చర్లపల్లి నుంచి కొల్లాంకు బయల్దేరనుంది.