New Cherlapalli Amrit Bharat Express: దేశ వ్యాప్తంగా వందేభారత్ తో పాటు అమృత్ భారత్ సేవలు మరింత విస్తరిస్తున్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో కలిపి 150కి పైగా వందేభారత్ రైళ్లు ప్రజలు సర్వీసులు అందిస్తుండగా, రీసెంట్ వందేభారత్ స్లీపర్ రైలు కూడా ప్రారంభం అయ్యింది. హౌరా-గౌహతి నడుమ అందుబాటులోకి వచ్చింది. అదే సమయంలో పేద, మధ్య తరగతి ప్రయాణీకులకు అనుకూలంగా అమృత్ భారత్ సర్వీసులను కేంద్ర ప్రభుత్వం విస్తరిస్తున్నది. అందులో భాగంగా ఇవాళ నాలుగు అమృత్ భారత్ సర్వీసులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. వీటిలో ఓ రైలు తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణం కొనసాగించనుంది. ఇప్పటికే చర్లపల్లి- ముజఫర్పూర్ మధ్య ఒక అమృత్ భారత్ నడుస్తుండగా, మరో రైలు తెలంగాణకు అలాట్ అయ్యింది. ఇంతకీ ఆ రైలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేస్తుంది? తెలుగు రాష్ట్రాల్లోని ఏ ప్రాంతాలను కవర్ చేస్తుంది? దీనితో ఎవరికి మేలు కలుగుతుంది? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఉభయ తెలుగు రాష్ట్రాలను కలిపే అమృత్ భారత్ రైలు ఇవాళ ప్రారంభం కానుంది. ఇది వారానికి ఓసారి అందుబాటులో ఉంటుంది. ఈ ఎక్స్ ప్రెస్ మొత్తం నాలుగు రాష్ట్రాలను కలుపుతూ వెళ్తుంది. కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రారంభమ్యే ఈ రైలు తమిళనాడు, ఏపీ మీదుగా తెలంగాణలోని చర్లపల్లికి చేరుకోనుంది. చర్లపల్లి- తిరువనంతపురం నార్త్ మధ్య ఈ సర్వీస్ లు మొదలుకానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఇనాగరేషన్ సందర్భంగా ఈ రైలు(నంబర్ 06308) తిరువనంతపురం నార్త్ నుంచి ఇవాళ (జనవరి 23) ఉదయం 10:45 నిమిషాలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు సాయంత్రం అంటే జనవరి 24 సాయత్రం 4:30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
జనవరి 27నుంచి ఈ రైలు(నంబర్ 17041/17042) ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ప్రతి మంగళవారం ఉదయం 7 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి.. మరుసటి రోజు మధ్యాహ్నం 2.45 నిమిషాలకు తిరువనంతపురం చేరుకుంటుంది. అదే రైలు తిరిగి బుధవారం సాయంత్రం తిరువనంతపురంలో మొదలై, గురువారం రాత్రి 11.30 గంటలకు చర్లపల్లికి వస్తుంది. ఈ రైలు తెలంగాణలోని నల్లగొండ, మిర్యాలగూడ.. ఏపీలోని సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తుంది. ప్రయాణికులు శుక్రవారం నుంచి రైల్వన్ యాప్ లేదంటే, టికెట్ కౌంటర్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
అమృత్ భారత్ రైలు పూర్తిగా నాన్ ఏసీతో నడుస్తాయి. అయినప్పటికీ అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. ఈ రైలులో మొత్తం 8 స్లీపర్ క్లాస్ కోచ్లు, 11 జనరల్ సెకండ్ క్లాస్, 2 దివ్యాంగుల కోచ్లు, ఒక ప్యాంట్రీకార్ ఉంటుంది. రెండు చివర్ల ఇంజన్లు ఉంటాయి. అద్భుతమైన ఎర్గొనామిక్ డిజైన్, ప్రతి సీటు దగ్గర ఛార్జింగ్ పాయింట్లు, ఫోల్డబుల్ స్నాక్ టేబుల్స్ తో పాటు ప్రతి కోచ్లో సీసీటీవీ ఉంటుంది. సెన్సార్ ఆధారిత ట్యాప్లు, మోడ్రన్ టాయిలెట్లు, ఎలక్ర్టో న్యూమాటిక్ ఫ్లషింగ్ ఉంటుంది. దివ్యాంగులకు అనుకూలంగా స్పెషల్ కోచ్లు, వీల్చైర్ రాంప్లు, ఆన్బోర్డ్ ఫుడ్ సర్వీస్ లాంటి సేవలు అందిస్తారు.
Read Also: వందే భారత్ స్లీపర్ vs అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్.. రెండింటి మధ్య తేడాలు ఇవే!