పండుగ సీజన్ లో ప్రయాణీకుల డిమాండ్ కు అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో నూతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి 22 పండుగ స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు చర్లపల్లి- ససారాం మధ్య రాకపోకలు కొనసాగించనున్నట్లు తెలిపింది. ఈ సర్వీసులు సెప్టెంబర్ 11 నుంచి మొదలుకొని నవంబర్ 21 వరకు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. దూర ప్రయాణీకులకు అవసరమైన అదనపు ప్రయాణ సౌకర్యాలను అందిస్తాయి దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. 07021 నంబర్ గల పండుగ ప్రత్యేక రైలు చర్లపల్లి నుంచి సెప్టెంబర్ 11- నవంబర్ 20 వరకు ప్రతి గురువారం రాకపోకలు కొనసాగిస్తుంది. అటు 07022 నెంబర్ గల రైలు ససారాం నుంచి సెప్టెంబర్ 12- నవంబర్ 21 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుంది. ప్రతి రూట్ లోనూ మొత్తం 11 సర్వీసులను ప్లాసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు మొత్తం 22 ట్రిప్పులు వేయనుంది.
ఈ పండుగ ప్రత్యేక రైళ్లు జనగాం, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, సిర్పూర్ కాగజ్ నగర్, బల్హర్షా, నాగ్ పూర్, ఇటార్సి, పిపారియా, మదన్ మహల్, కట్ని, సత్నా, మాణిక్ పూర్, ప్రయాగ్ రాజ్ ఛోకి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, భాబువా రోడ్ లాంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి. ఇవి సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణీకులకు అనుగుణంగా ఉంటాయని అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక రైళ్లలో 1 AC, 2AC, 3AC, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోలు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ఎంపికలకు అనుగుణంగా బెర్తులను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. పండుగ రద్దీని తగ్గించడం, ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు సౌకర్యవంతంగా, సురక్షితంగా చేరుకోవడం లక్ష్యంగా ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.
పండుగ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రయాణీకులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ప్రయాణ సమయంలో ఇబ్బందులు పడకుండా ఈ అదనపు రైళ్లను వినియోగించుకోవాలన్నారు. ఈ పండుగ స్పెషల్ రైళ్లను ప్రవేశపెట్టడం వల్ల పీక్ డిమాండ్ సమయంలో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని పొందే అవకాశం ఉందన్నారు. ఈ రైళ్లు దసరా, దీపావళి, ఛత్ పూజ పండుగల సమయంలో ఎక్కువ రాకపోకలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రైలును సుమారు 22 ట్రిప్పులు వేయిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రద్దీ పెరుగుతున్న కొద్దీ మరిన్ని అదనపు రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ ఫెస్టివల్ సీజన్ కోసం ఏకంగా 12 వేల అదనపు రైళ్లను నడపనున్నట్లు ఇప్పటికే భారతీయ రైల్వే ప్రకటించింది.
Read Also: బస్సును ఢీకొట్టిన రైలు, 10 మంది స్పాట్ డెడ్!