Sudan Gurung: హిమాలయం దేశం నేపాల్ ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. వారం రోజులుగా యువత ఆందోళనతో అట్టుడికింది. ఉద్యమాన్ని అణిచి వేయాలని అక్కడి ప్రభుత్వం చేయని ప్రయత్నాలు లేవు. చివరకు ప్రభుత్వం దిగొచ్చింది. పదుల సంఖ్యలో మృత్యువాతపడినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ ఉద్యమం వెనుక ఏకైక వ్యక్తి సుడాన్ గురుంగ్. ఎవరీ సుడాన్? అతడి ఆశయం ఏంటి? వెనుక ఎవరున్నారు? ఇవే ప్రశ్నలు మొదలయ్యాయి.
నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ లక్షలాది యువత రోడ్లపైకి వచ్చింది. యువత రోడ్లపైకి రావడానికి కారణం అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే. ప్రభుత్వం ఆర్మీని దించినా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఫలితంగా పదులు సంఖ్యలో యువత మరణించారు. ఇక గాయపడినవారి గురించి చెప్పనక్కర్లేదు. ఆ ఉద్యమం వెనుక కర్మ, కర్త, క్రియ అన్నీ సుడాన్ గురుంగ్. కేవలం 36 ఏళ్ల గురుంగ్ గురించి ఆ దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.
యువత ఉద్యమానికి నాయకత్వం వహించాడు సుడాన్ గురుంగ్. అవినీతి, ఆర్థిక అసమానత, చెడు పాలనకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించాడు. దీనికితోడు అక్కడి ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించింది. దీంతో యువత ఆగ్రహంతో రగిలిపోయింది. ఆందోళనకు దించింది. యువత ఆగ్రహం వెనుక ఒకే ఒక్కడు. నేపాల్ వ్యాప్తంగా కొన్నిగంటల్లో యువతను ఏకతాటిపైకి తెచ్చాడు. 36 ఏళ్ల సామాజిక కార్యకర్త సుడాన్. నేపాల్లో చెలరేగిన జెన్-జెడ్ తిరుగుబాటుకు సుడాన్ గురుంగ్ నాయకత్వం వహించాడు.
నేపాల్ రాజకీయ వర్గాల్లో అంతగా పరిచయం లేని పేరు సుడాన్ గురుంగ్. గతంలో ఈవెంట్ మేనేజ్మెంట్లో పని చేసేవాడు. జీవితం పార్టీల చుట్టూ తిరిగేది. సరిగ్గా పదేళ్ల కిందట లంటే 2015లో నేపాల్లో సంభవించిన భూకంపం అతడి జీవితాన్ని మార్చేసింది. ఆ తర్వాత సుడాన్ సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. హమీ నేపాల్ పేరుతో స్వచ్ఛంద సంస్థ స్థాపించాడు.
ALSO READ: ఎన్నారైలపై దాడులు.. మనోళ్లంటే ఎందుకంత కోపం
దానికి అధ్యక్షుడిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత కార్యకర్తగా మారాడు. ఈనెల 4న నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపింది. దీంతో ఆదేశంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడాన్ని నిరసిస్తూ వేలాది మంది యువత అయోమయంలో పడ్డారు. వారికి సుడాన్ గురుంగ్ వారికి ఓ మార్గాన్ని చూపించాడు.
హింసకు ఏ మాత్రం తావులేకుండా ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రణాళిక సిద్ధం చేశాడు. శాంతియుతంగా నిరసనకు దిగాడు. విద్యార్థులంతా స్కూల్ యూనిఫామ్లో చేతిలో పుస్తకాలతో పార్లమెంట్ వద్దకు తరలిరావాలంటూ ఆయన ఇచ్చిన పిలుపు సామాజిక మాధ్యమాల్లో దావానలంలా వ్యాపించింది.
సోషల్ మీడియా నిషేధం పైకి కనిపించే ఓ కారణం మాత్రమే. రాజకీయ నాయకుల పిల్లల విలాసవంతమైన జీవితాలు, ప్రభుత్వం అవినీతిపై యువతలో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. నెపో కిడ్ అనే హ్యాష్ ట్యాగ్తో జరుగుతున్న ప్రచారానికి సుడాన్ తన గొంతును కలిపాడు. సామాన్యుడికి ఇంటర్నెట్ దూరం చేసిన పాలకులు.. విదేశాల్లో ప్రజాధనంతో మీ పిల్లలు సుఖపడతారా? అంటూ సంధించిన ప్రశ్నలు యువతను తాకాయి. దీంతో ఈ ఉద్యమం సోషల్ మీడియా పునరుద్ధరణకే కాకుండా ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా రూపు దిద్దుకుంది.
రాజకీయ నాయకుడి మాదిరిగా ఆవేశపూరిత ప్రసంగాలు చేయలేదు సుడాన్ గురుంగ్. నిశ్శబ్దంగా స్పష్టమైన లక్ష్యంతో యువతను నడిపించాడు. ఆయన విధానం అంతర్జాతీయంగా మద్దతు పెరిగింది. పోలీసుల కాల్పుల తర్వాత శాంతియుతంగా ఉండాలని, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని పదే పదే విజ్ఞప్తి చేసుకుంటూ వచ్చాడు.. సక్సెస్ అయ్యాడు.
చివరకు నేపాల్ ప్రభుత్వం దిగొచ్చింది. సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేసింది. మరి సుడాన్ గురుంగ్ సైలెంట్గా ఉంటాడా? నేపాల్ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తాడా? నేపాల్ యువత తమ హక్కుల కోసం ఎలా పోరాడాలో నేర్పిన ఆధునిక నాయకుడిగా నిలిచిపోయాడు.