SpiceJet Flights: ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య చెలరేగిన యుద్ధం.. మధ్యప్రాచ్యంలో భీతావహ పరిస్థితులను సృష్టిస్తోంది. దీంతో ఆయా దేశాల్లో పనిచేస్తున్న తమ కుటుంబ సభ్యుల క్షేమం గురించి.. భారతీయుల్లో ఆందోళన మెుదలైంది. దీనికి తోడు గగనతలంలో ఆంక్షలు పెరిగిపోతుండటంతో అక్కడి వారు.. తిరిగి స్వదేశానికి వచ్చేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో యూఏఈలోని భారతీయులకు స్పైస్ జెట్ శుభవార్త చెప్పింది. భారతదేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు ఏకంగా 14 ప్రత్యేక విమానాలను నడపనున్నట్లు ప్రకటించింది.
మార్చి 6వ తేదీ నుంచి ఈ ప్రత్యేక విమానాలను నడుపనున్నట్లు తన అధికారిక ఎక్స్ ఖాతాలో స్పైస్ జెట్ స్పష్టం చేసింది. ఈ 14 విమానాలలో.. 13 ఫ్లైట్స్ ను ఫుజైరా (Fujairah) నుండి ఒక విమానం దుబాయ్ నుండి బయలుదేరుతాయని స్పష్టం చేసింది. వీటిలో 9 విమానాలు ముంబయికి రానుండగా.. 4 విమానాలు ఢిల్లీకి, ఒకటి పూణెకు వెళ్లేలా స్పైస్ జెట్ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
కాగా, గత 3 రోజుల వ్యవధిలో యూఏఈ నుంచి భారత్ కు 25 ప్రత్యేక విమానాలను స్పైస్ జెట్ నడిపింది. తద్వారా వందలాది మంది భారతీయులు సురక్షితంగా తమ ఇళ్లకు చేరడంలో కీలక పాత్ర పోషించింది. ఇదిలా ఉంటే మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య చెలరేగిన ఘర్షణ కారణంగా గగనతలం మూసివేయబడటం లేదా పరిమితం చేయడం జరుగుతోంది. ఫలితంగా సాధారణ విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోంది. దీనివల్ల వేలాది మంది ప్రయాణికులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయారు. వారికి సహాయం చేసేందుకు భారతీయ ఎయిర్ లైన్స్ ప్రత్యేక విమానాలను నడుపుతున్నాయి.
మరోవైపు సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో విమాన టికెట్ ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం యూఏఈలోని ఫుజైరా నుంచి దిల్లీకి రూ.93,374 టికెట్ ధరను వసూలు చేస్తున్నారు. అదే సాధారణ రోజుల్లో ఈ టికెట్ ధర రూ.78,000-85,000 మధ్య ఉంటుందని ప్రయాణికులు చెబుతున్నారు. కాగా పలు నివేదికల ప్రకారం.. భారత్ – పశ్చిమ ఆసియా మార్గాల్లో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 5వ తేదీ మధ్య ఏకంగా 1,770 విమానాలు రద్దు చేయబడ్డాయి.
Also Read: Tips For Teeth:పళ్లు జివ్వుమంటున్నాయా ?అందుకు మీరు చేస్తున్న ఈ 5 పనులే కారణం!