హోలీ వేడుకల్లో జరిగిన చిన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారి ఒక యువకుడి ప్రాణాన్ని బలిగొన్న విషాద ఘటన ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో చోటుచేసుకుంది. జేజే కాలనీలో హోలీ పండుగ రోజు జరిగిన ఈ ఘర్షణలో 26 ఏళ్ల తరుణ్ కుమార్ అనే యువకుడు మరణించాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీయడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పోలీసుల వివరాల ప్రకారం.. రాత్రి వేళ 10:30 గంటల సమయంలో ఓ 11 ఏళ్ల బాలిక తన ఇంటి బిల్డింగ్ పై నుంచి వాటర్ బెలూన్లు విసురుతోంది. ఆ సమయంలో వీధిలో వెళ్తున్న ఒక ముస్లిం మహిళపై బెలూన్ పడింది. దీంతో ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగింది. చిన్నగా మొదలైన ఈ గొడవ రెండు కుటుంబాల మధ్య పెద్ద వివాదంగా మారింది. బాలిక కుటుంబ సభ్యులు క్షమాపణలు చెప్పడంతో మొదట సమస్య సర్దుమణిగినట్లు కనిపించింది.
అయితే.. ఈ గొడవకు ఎలాంటి సంబంధం లేని యువకుడిపై కొంత మంది దాడికి దిగారు. డిజిటల్ మార్కెటింగ్ కోర్సు చేస్తున్న తరుణ్ కుమార్ స్నేహితులతో కలిసి హోలీ జరుపుకుని రాత్రి తన బైక్పై ఇంటికి వస్తున్నాడు. అప్పటికే జరిగిన గొడవ గురించి అతనికి ఏమీ తెలియదు. మార్గమధ్యంలో సుమారు పది మంది వ్యక్తులు అతడిని అడ్డుకుని కర్రలు, రాళ్లు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడి కింద పడిపోయిన తరుణ్ గుండెలపై పెద్ద బండరాయిని పడవేసి క్రూరంగా హింసించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చికిత్స పొందుతూ తరుణ్ గురువారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు.
ఈ హత్యతో ఉత్తమ్ నగర్ ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. బాధితుడి కుటుంబానికి మద్దతుగా పలువురు నిరసనకారులు నిందితుల ఇంటిపై దాడికి ప్రయత్నించారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఈ కేసులో ముస్లిం కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు ఒక మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. సీనియర్ పోలీస్ అధికారులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం భద్రతా బలగాలు నిరంతరం నిఘా ఉంచాయి.
ALSO READ: Road Accidents: తెలంగాణలో మూడు ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఆరుగురు మృతి