Vaikunta Dwara Darshan Tokens:తిరుమలలో డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు మొదలవుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ప్రకటించింది. జనవరి 8 వరకు ఈ దర్శనాలు కొనసాగుతాయని తెలిపింది. వైకుంఠ ఏకాదశి దృష్ట్యా టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించింది. తిరుమల అన్నమయ్య భవన్ లో చైర్మెన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. టిటిడి ఈఓ సింఘాల్, ఇతర బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బోర్డులో కీలక నిర్ణయాలు తీసుకుంది.
సర్వదర్శన భక్తుల సౌకర్యం కోసం ఈ సారి పెద్ద ఎత్తున మార్పులు చేపట్టినట్టు టీటీడీ చైర్మెన్ తెలిపారు. మొదటి మూడు రోజులు అంటే, డిసెంబర్ 30, 31, జనవరి 1న పూర్తిగా సర్వదర్శన భక్తులకే కేటాయించారు. ఈ మూడు రోజుల్లో మొత్తం 1.88 లక్షల టోకెన్లు DIP ద్వారా ఆన్ లైన్ లో జారీ చేయనున్నారు. రిజిస్ట్రేషన్ నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు ఉంటుంది. టోకెన్లు డిసెంబర్ 2 నుంచి అందుబాటులో ఉంటాయి. మిగతా ఏడు రోజులు అంటే.. జనవరి 2 నుంచి 8 వరకు రోజుకు 15,000 సర్వదర్శన టోకెన్లతో పాటు 1,000 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టోకెన్లు జారీ అవుతాయి. మొత్తం 10 రోజుల్లో సుమారు 8 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుందని అంచనా. 182 గంటలకు పైగా వైకుంఠ ద్వార దర్శనం కోసం అందుబాటులో ఉండగా, 164 గంటలను సాధారణ భక్తులకు కేటాయించబడింది.
సర్వదర్శన భక్తులకు మరింత సమయం కేటాయించేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాలను తగ్గించినట్లు టీటీడీ ప్రకటించింది. మొదటి రోజు 20 గంటల దర్శనం ఉండగా అందులో వీఐపీ బ్రేక్ కేవలం 4గంటల 45 నిమిషాలకు పరిమితం చేసింది. మిగతా రోజుల్లో గరిష్ఠంగా 2 గంటలకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉంటాయి. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ ఆధారంగా క్యూ లైన్లు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. భక్తులు అధికారిక టీటీడీ వెబ్సైట్ ద్వారా టోకెన్లు బుక్ చేసుకోవాలని అధికారులు కోరారు. తిరుపతి, తిరుమల స్థానికులకు జనవరి 6,7,8 తేదీల్లో ఆన్ లైన్ లో ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి ముందుగా వచ్చిన వారికి 5,000 టోకెన్లు అందిస్తారు. మొత్తంగా వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల రద్దీ భారీగా ఉంటుందని టీటీడీ అంచనా వేస్తుంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తుంది.
Read Also: తిరుమల మెట్లు ఎక్కుతున్నారా.. ఈ టైమ్ లో పిల్లలకు అనుమతి లేదు!