TTD Alipiri And Srivari Mettu Routes: తిరుమల తిరుపతి దేవస్థానం అలిపిరి నడక మార్గంలో చిరుతల సంచారం పెరిగిన నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎవరికీ ఎలాంటి హాని కలకగకూడదనే ఆలోచనతో పలు ఆంక్షలు విధించింది. ముఖ్యంగా, 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మధ్యాహ్నం 2 గంటల తర్వాత అలిపిరి నడక మార్గంలో ప్రవేశం అనుమతించరని తెలిపింది. ఈ మేరకు అలిపిరి మెట్ల మార్గం దగ్గర హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.
అలిపిరి మార్గంలో 7వ మైలు దగ్గర చిరుతలు తరచూ కనిపిస్తున్నాయి. ఇటీవలి ఘటనల్లో చిన్నారులపై దాడులు జరిగాయి. 2023లో 6 ఏళ్ల చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసింది. ఈ నేపథ్యంలో భక్తులలో ఆందోళనలు మొదలయ్యాయి. ముందస్తు జాగ్రత్తగా పిల్లలు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు 12 ఏళ్ల లోపు పిల్లల ప్రవేశం మీద ఆంక్షలు విధించారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఆ తర్వాత అనుమతివ్వడం లేదు. అదే సమయంలో భక్తులు గుంపులుగా నడవాలని సూచించారు. రాత్రి 9:30 గంటల తర్వాత ఈ మార్గాన్ని కంప్లీట్ గా మూసేస్తున్నారు. భక్తులు గోవింద నామ స్మరణతో నడవడంతో పాటు భద్రతా సిబ్బంది సూచనలు పాటించాలని అధికారులు చెప్పారు.
నిజానికి ఈ ఆంక్షలు 2023 నుంచి కొనసాగుతున్నాయి. కానీ, కొంత మంది ఇప్పటికీ చిన్న పిల్లలతో వెళ్లడంతో అధికారులు తిప్పి పంపిస్తున్నారు. ఈ కారణంతో మరోసారి అధికారులు పిల్లల ప్రవేశానికి సంబంధించి ఆంక్షల గురించి తెలిసేలా హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు.
Read Also: జస్ట్, 7 గంటల్లో ప్రపంచాన్ని చుట్టేసే విమానాన్ని సిద్ధం చేస్తున్న చైనా.. టికెట్ ధర ఎంతంటే?
చిరుతల సంచారం ఉన్నందున టీటీడీ, అటవీ శాఖలు కలిసి పర్యవేక్షణ పెంచాయి. హైకోర్టు కూడా భక్తులకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని టీటీడీతో పాటు అటవీశాఖ అధికారులకు సూచించింది. భక్తులు శ్రీవారి మెట్టు మార్గంలో కూడా ఎక్కే అవకాశం ఉంటుంది. సుమారు 2.1 కి.మీ పరిధిలో 1200 మెట్లు ఉంటాయి. అయితే, ఈ మార్గంలో కాస్త ఆంక్షలు తక్కువగా ఉంటాయి. ఏ మార్గంలో వెళ్లినా భక్తులు జాగ్రత్తగా ఉండాలని, భద్రతా అధికారుల సూచనలను పాటించాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు.
Read Also: భూమ్మీద కోల్డెస్ట్ రైలు ప్రయాణాలు, విండో ఓపెన్ చేస్తే గడ్డకట్టుకుపోతారండోయ్!