Longest Train Routes in India: భారతీయ రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థలతో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. దేశ వ్యాప్తంగా నిత్యం వేలాది రైళ్లు నడుస్తాయి. లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. అయితే, దేశంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లు ఏవి? అవి ఎన్ని కిలో మీటర్లు ప్రయాణిస్తాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం…
దేశంలో అత్యంత దూరం ప్రయాణించే రైళ్లు
⦿దిబ్రూఘర్ – కన్యాకుమారి వివేక్ ఎక్స్ప్రెస్
దిబ్రూఘర్ – కన్యాకుమారి వివేక్ ఎక్స్ ప్రెస్ దేశంలోని అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైలుగా గుర్తింపు తెచ్చుకుంది. ఇది అస్సాంలోని దిబ్రూఘర్ నుంచి బయల్దేరి తమిళనాడులోని కన్యాకుమారి వరకు ప్రయాణిస్తుంది. మొత్తం 4,218 కి.మీ జర్నీ చేస్తుంది. ఆసియా ఖండంలోనే ఎక్కువ దూరం ప్రయాణించే రైలుగా గుర్తింపు తెచ్చుకుంది. 2012లో ఈ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించారు. ఈ రైలు అస్సాం, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. మార్గ మధ్యంలో మొత్తం 59 చోట్ల ఈ రైలు ఆగుతుంది.
⦿ తిరువనంతపురం సెంట్రల్- సిల్చార్ అరోనై సూపర్ఫాస్ట్ ఎక్స్ ప్రెస్
ఈ రైలు దేశంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రెండో రైలుగా గుర్తింపు తెచ్చుకుంది. ఇది 3,932 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. కేరళలోని తిరువనంతపురం సెంట్రల్ నుంచి ప్రారంభమయ్యే ప్రయాణం అస్సాంలోని సిల్చార్ వరకు కొనసాగుతుంది. తొలుత ఈ రైలు తిరువనంతపురం- గౌహతి మధ్య నడిచేది. ఆ తర్వాత దీన్ని సిల్చార్ వరకు పొడిగించారు. ఇది మొత్తం 11 రాష్ట్రాల్లో ప్రయాణిస్తుంది. 74 గంటల పాటు ఏగబిగిన జర్నీ చేస్తుంది.
⦿ కన్యాకుమారి- శ్రీ మాతా వైష్ణో దేవి కత్ర హిమ్ సాగర్ ఎక్స్ ప్రెస్
ఇది దేశ దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తర ప్రాంతం వరకు ప్రయాణిస్తుంది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి మొదలయ్యే ప్రయాణం జమ్మూ కాశ్మీర్ లోని శ్రీ మాతా వైష్ణో దేవి కత్ర వరకు ప్రయాణిస్తుంది. దేశంలో అత్యంత దూరం ప్రయాణించే మూడో రైలుగా గుర్తింపు పొందింది. ఈ రైలు మొత్తం 3,787 కి.మీ ప్రయాణిస్తుంది. మొత్తం 12 రాష్ట్రాలను దాటుకుంటూ వెళ్తుంది. ఈ రైలు 68 గంటల 20 నిమిషాల పాటు ప్రయాణం చేస్తుంది.
⦿తిరునెల్వేలి జంక్షన్- శ్రీ మాతా వైష్ణో దేవి కట్రా టెన్ జమ్మూ ఎక్స్ ప్రెస్
దేశంలో అత్యంత దూరం ప్రయాణించే నాలుగో రైలుగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైలు తమిళనాడులోని తిరునెల్వేలి జంక్షన్ నుంచి ప్రయాణాన్ని మొదలు పెట్టి జమ్మూ కాశ్మీర్ లోని శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా వరకు ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. మొత్తం 3,642 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. మొత్తం 13 రాష్ట్రాల మీదుగా ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఈ రైలు 71 గంటల 20 నిమిషాల పాటు ప్రయాణిస్తుంది.
⦿న్యూ టిన్సుకియా- బెంగళూరు వీక్లీ ఎక్స్ ప్రెస్
దేశంలో అత్యంత దూరం ప్రయాణించే 5వ రైలుగా గుర్తింపు తెచ్చుకుంది. ఇది అస్సాంలోని న్యూ టిన్సుకియా నుంచి కర్ణాటకలోని బెంగళూరు వరకు నడుస్తుంది. మొత్తం 3,642 కి.మీ ప్రయాణిస్తుంది. మొత్తం 7 రాష్ట్రాల మీదు ప్రయాణం చేస్తుంది. ఏకంగా 65 గంటల పాటు ఆగకుండా ప్రయాణం కొనసాగిస్తుంది.
Read Also: ప్రపంచంలో అత్యంత ప్రమాదకర రైల్వే మార్గాలు.. ఏమాత్రం తేడా వచ్చినా గోవిందా!